• Telugu News
  • /Latest

Minister Niranjan Reddy | రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి నిరంజ‌న్ రెడ్డి

Minister Niranjan Reddy | కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు యూరియాపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం అన్నదాతలు ఆందోళన చెంద‌వ‌ద్దు మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కృత్రిమ […]

Reported by: Somu | latest | IST
Read Time: 4 mins
Minister Niranjan Reddy | రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి నిరంజ‌న్ రెడ్డి

Minister Niranjan Reddy |

హైలైట్స్:

  • కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు
  • యూరియాపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం
  • అన్నదాతలు ఆందోళన చెంద‌వ‌ద్దు
  • మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండి ప‌డ్డారు. ఇది అవగాహనా రాహిత్యమే కాదు, దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమ‌ని ఆరోపించారు. సంబంధిత సహకార సంఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఎవరినీ ఉపేక్షించమ‌ని వెల్ల‌డించారు.

శనివారం సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ‌హించారు. ఈ వానకాలం సీజన్‌కు 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ముందస్తు నిల్వ ఉన్న‌ద‌న్నారు. మొత్తం ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్ టన్నులన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులని తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎరువుల కొరత లేదని మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతున్నదని వెల్ల‌డించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలో 15,838 మెట్రిక్ టన్నుల యూరియా ఖరీదు చేయడం జరిగిందని మంత్రి సింగిరెడ్డి పేర్కొన్నారు. ఈ స‌మీక్ష‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, సంయుక్త సంచాలకులు (ఎరువులు) రాములు తదితరులు పాల్గొన్నారు.