ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది
సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ
కవిత వ్యాఖ్యలు
కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై జడ్జీ మండిపాటు
విధాత : ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మార్చి 15న హైదరాబాదులో కవితను ఆమె నివాసంలో ఈడి అరెస్టు చేసింది. పది రోజుల కస్టడి అనంతరం మార్చి 26న కోర్టు ఆమెకు జ్యూడిషియల్ కస్టడి విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. జైల్లో ఉండగానే ఈనెల 12న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిపోవడంతో సోమవారం కోర్టులో హాజరు పరిచారు. కవితకు కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కాగా కవిత కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదని..బీజేపీ కస్టడీ అని విమర్శించింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలనే సీబీఐ ప్రశ్నలుగా వేస్తుందని, రెండేళ్లుగా అడుగుతున్న ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆరోపించింది. కాగా కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటం పట్ల జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసినా మీరు కోర్టు ప్రాంగణంలో మాట్లాడరాదని, మరోసారి పునరావృతం కారాదంటూ హెచ్చరించింది.
మరోవైపు కవిత మూడు రోజుల కస్టడీ విచారణలో తమకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14కోట్ల ముడుపులపై ఆమె తప్పుదోవ పట్టించే సమాధానాలు చెప్పారని, లేని భూములు ఉన్నట్లుగా చూపించి విక్రయం జరపడంపై ఆమె సమాధానాలు చెప్పలేదని తెలిపింది. సహ నిందితులు మాగుంట శ్రీనివాస్రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్చంద్రారెడ్డి, విజయ్ నాయర్లతో భేటీలపైన, ఆప్కు ముడుపులపైన ఆమెను ప్రశ్నించామని పేర్కోంది. కవిత సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను ధ్వంసం చేసి దర్యాప్తును ప్రభావితం చేయగలదని తెలిపింది. దీంతో కోర్టు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది.
ఏప్రిల్ 22న కవిత బెయిల్ పిటిషన్ విచారణ
ఈనెల 22న సీబీఐ కేసులో కవిత మెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని స్పెషల్ కోర్టు తెలిపింది. సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన స్పెషల్ కోర్టు జడ్జి ఏప్రిల్ 20 లోపు సీబీఐ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది