Nalgonda విధాత: పాదయాత్రలు అవుట్ డేటెడ్ అంటున్నవారే ఆ పాదయాత్రలకు ఆగమాగమవుతున్న తీరు తెలంగాణ రాజకీయాలలో కనిపిస్తుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బిజెపికి, రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్కి జనం నుంచి ఆ పార్టీలు ఆశించిన ఊపు, ఉత్సాహాన్ని అందించాయి. వైఎస్సాఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సైతం అధికార పార్టీని గట్టిగానే చికాకు పెట్టగా అధికారం అండతో ఆమె పాదయాత్రను అడ్డుకోగలిగారు. ఈ పరిణామాల మధ్య మొదలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ […]
Nalgonda
విధాత: పాదయాత్రలు అవుట్ డేటెడ్ అంటున్నవారే ఆ పాదయాత్రలకు ఆగమాగమవుతున్న తీరు తెలంగాణ రాజకీయాలలో కనిపిస్తుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బిజెపికి, రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్కి జనం నుంచి ఆ పార్టీలు ఆశించిన ఊపు, ఉత్సాహాన్ని అందించాయి. వైఎస్సాఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సైతం అధికార పార్టీని గట్టిగానే చికాకు పెట్టగా అధికారం అండతో ఆమె పాదయాత్రను అడ్డుకోగలిగారు.
ఈ పరిణామాల మధ్య మొదలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు కూడా క్రమంగా ప్రజాధరణ పెరుగుతున్న తీరు పాలక వర్గాల్లో అసహనాన్ని రగిలిస్తుంది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన భట్టి పాదయాత్ర మండుటెండల్లో, అకాల వర్షాల మధ్య కొనసాగుతూ 14 జిల్లాల్లోని 30 నియోజకవర్గాల మీదుగా సాగి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది.
గతంలో కాంగ్రెస్ హవా కొనసాగిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాతినిద్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లు కే.జానారెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా వారికి ధీటుగా ప్రతి నియోజక వర్గంలో టికెట్ రేసులో ఉన్న ఆశావహులతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వంతో కనిపిస్తుంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించేందుకు కావలసిన మేజిక్ ఫిగర్ సీట్ల సాధనకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా పైన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అంతా కలిసి పనిచేస్తే గులాబీ కోటను బద్దలు కొట్టడం కష్టం కాకపోయినా కాంగ్రెస్ నాయకుల మధ్య అనైక్యతనేపార్టీ విజయాలకు ప్రతిబంధకంగా తయారవుతుంది. వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఈ దఫా కలిసికట్టుగా పోరాడాలన్న నిర్ణయం ఇటీవల జిల్లా కాంగ్రెస్ సీనియర్లలో కనిపిస్తున్నప్పటికీ, వారి అనుచర వర్గాలకు టికెట్లు, సీఎం పదవుల లొల్లి వారి ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తుంది.
ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడుగుపెట్టిన భట్టి పాదయాత్రకు మారుమూల ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన దేవరకొండ నియోజకవర్గం లో ప్రజల నుండి మంచి స్పందన వ్యక్తం అవ్వడం కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.
జన సమీకరణకు పెద్దగా ఖర్చు చేయకుండానే దారి వెంట సాగుతున్న పాదయాత్రకు, కార్నర్ మీటింగ్ లకు వేలాదిగా జనం హాజరవుతున్న నేపథ్యం రానున్న ఎన్నికల దిశగా కాంగ్రెస్ లో కథనోత్సహం రేపింది. భట్టి పాదయాత్ర సాగుతున్న మార్గాల్లో సమీపాన ఉన్న గ్రామస్తులు, పేదలు , దళిత, గిరిజన,బడుగు బలహీన వర్గాల ప్రజలు, పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు స్వచ్ఛందంగా తరలివచ్చి భట్టికి తమ సమస్యలను ఏకరువుపెడుతున్నారు.
అదే సమయంలో భట్టి పాదయాత్రకు వస్తున్న జన స్పందనకు తోడు పాదయాత్రలో ఆయన సీఎం కేసీఆర్ పరిపాలన వైఫల్యాలపైన సంధిస్తున్న విమర్శలు జనంలోకి సూటిగా వెళుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, వ్యవసాయ సబ్సిడీలు, రైతు రుణమాఫీ, మహిళా సంఘాల రుణాలు, భార్యాభర్తల పింఛన్ వంటి కాంగ్రెస్ గత పథకాలతో పాటు ప్రస్తుతం ధనిక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పోల్చుతూ భట్టి జనాన్ని ఆలోచనలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక అంశాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. ధరణి వైఫల్యం, కాంగ్రెస్ భూ పంపిణీ భూముల మాయం, బిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అంశాలను భట్టి చర్చకు పెడుతున్నారు. పాదయాత్రలో భట్టి చేస్తున్న ప్రసంగాలతో పాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పైన, సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పైన, ఎమ్మెల్యేల పైన చేస్తున్న విమర్శల దాడికి గులాబీ కోటలో ప్రకంపనలు రేగుతున్నాయి.
పాదయాత్రలో భట్టి చేసిన విమర్శలు ఇంతకాలంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న విమర్శల కంటే పదునుగా ప్రాచుర్యంలోకి వెళ్లడంతో అటు గుత్తా, ఇటు జగదీష్ రెడ్డిలు రంగంలోకి దిగి వరుస ప్రెస్ మీట్ లతో ప్రతి విమర్శలు చేస్తున్నారు. అరవై యేండ్ల కాంగ్రెస్ పాలనే జిల్లాలో అన్ని సమస్యలకు కారణమంటూ రివర్స్ అటాక్ చేశారు. అంతే స్పీడ్ గా భట్టి కూడా వారి విమర్శలకు తిరిగి మరింత ఘాటుగా ప్రతి విమర్శలు చేస్తుండటంతో ప్రస్తుతం వారి మధ్య సాగుతున్న విమర్శల యుద్ధం జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
జిల్లా ప్రజల సాగు తాగు నీటి సమస్యలకు మీరంటే మీరే కారణం అంటూ, మీరే క్షమాపణ చెప్పాలని కాదు మీరే ముక్కు నేలకు రాయాలంటు అటు భట్టి, ఇటు జగదీష్ రెడ్డి, గుత్తాలకు మధ్య మాటల మంటలు భగ్గుమన్నాయి. తిక్కల భట్టి అని పంచె కట్టుతో పాదయాత్ర చేస్తే వైఎస్సాఆర్ అయిపోడని గుత్తా భట్టీని విమర్శించారు. అభివృద్ధి లెక్కలు తెలవని గురివింద భట్టి అంటూ జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై తాను ప్రశ్నిస్తే ఫ్యూడల్ మనస్తత్వంతో ఒకరు, నా పంచె, గోసి గురించి మరొకరు విమర్శలు చేస్తున్నరని భట్టి వారిపై ఎదురు దాడి చేశారు.
శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు కేంద్రంగా భట్టి విమర్శల దాడి మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు ఆలస్యంపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంలో భట్టి వాదన పైచేయిగా నిలిచింది. టీబిఎం మిషన్లు, సాంకేతిక సమస్యలు అంటూ జగదీష్ రెడ్డి,గుత్తాలు చేసిన విమర్శలను వరల్డ్ బెస్ట్ మిషన్స్ అని భట్టి వారిపైకే తిప్పి కొట్టారు.
అసలు నిధుల సాధనలో వారు తొమ్మిదేళ్లుగా ఎందుకు విఫలమయ్యారో చెప్పాలంటూ భట్టి సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ వద్దకు వెళ్లి నిధులు అడిగే ధైర్యం వారికి లేదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హాయం లో నిర్మితమైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లే నేటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్నాయంటూ భట్టి జనానికి గుర్తు చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వేయి కోట్లు కేటాయించి సొరంగం ప్రాజెక్టును పూర్తి చేయకపోగా, కొత్తగా చేపట్టిన డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే చేయలేకపోయిందని, తాము నిర్మించిన ఎస్సారెస్పి రెండో దశ కాలువలకు వస్తున్న నీటిని కాలేశ్వరం తొలి ఫలితం అంటూ జగదీష్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ భట్టి గట్టిగానే వినిపించారు.
నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కొత్తగా ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని భట్టి విమర్శలు చేశారు. అయితే పాలమూరు -డిండి ఎత్తిపోతల పథకాలపై తెరవెనుక కోర్టు స్టేలకు కాంగ్రెస్ కారణమని జగదీష్ రెడ్డి ఆరోపించగా, అన్ని క్లియరెన్స్ లు ఉన్న ఎస్ఎల్బిసిని ఎందుకు పూర్తి చేయలేదంటూ భట్టి నిలదీశారు.
24గంటల ఉచిత విద్యుత్ పై గొప్పగా చెప్పిన జగదీష్ రెడ్డి మాటలను భట్టి తిప్పికొడుతూ కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ ప్లాంట్ నిర్మించి విద్యుత్ సరఫరా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 24గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదన్న జగదీష్ రెడ్డి మాటలపై భట్టి స్పందిస్తూ ఒక్కో రాష్ట్రంలో ఒక్క భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు, ప్రజల జీవన రీతిలలో, మౌలిక అవసరాల్లో తేడాలతో ఒక్కో రంగానికి ప్రాధాన్యత ఉంటుందని, ఆ మేరకు అక్కడి ప్రభుత్వ విధానాలు ఉంటాయన్నారు. అక్కరలేని చోట 24 గంటలు ఎందుకు ఇవ్వడం లేదంటు అర్ధరహితంగా మాట్లాడుతున్నారంటూ భట్టి కౌంటర్ వేశారు.
తెలంగాణలో వ్యవసాయం,పారిశ్రామిక రంగం ప్రధానమైన నేపథ్యంలో ఇక్కడ విద్యుత్ డిమాండ్ ఉందంటూ భట్టి రివర్స్ ఎటాక్ చేశారు. మిషన్ భగీరథ, కాకతీయ, కాలేశ్వరం అవినీతిపై, ఎమ్మెల్యేల అక్రమ వ్యాపారాలపై, ఫామ్ హౌజ్ కల్చర్ పై, వారి అవినీతి, ఆస్తులపై పాదయాత్రలో భట్టి సహా ఇతర కాంగ్రెస్ నేతలు తమ విమర్శలతో కాకరేపారు.
నిధుల కొరతతో కేసిఆర్ కిట్లు శిశువులు పుట్టి, నడుస్తున్న దశకు ఎదిగినప్పటికి అందడం లేదంటూ, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం సకాలంలో అందడం లేదని, యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యాయని, నిరుద్యోగం పెరిగిందని, ఉద్యమ ఆకాంక్షలు నీళ్లు, నిధులు,నియామకాలు నెరవేరక కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ అవినీతి పాలనలో రాష్ట్రం ఐదు లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైందంటు భట్టి తన ప్రసంగంలో జనానికి ఏకరువు పెడుతున్నారు.
కేసీఅర్ పాలనలో ప్రజల స్వేచ్ఛ హరించబడిందని పోలీస్ నిర్బంధంతో ప్రజల భావ స్వేచ్ఛ అణిచివేతకు గురైందని భట్టి ప్రస్తావిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు, వ్యవసాయ సబ్సిడీలు, పంట నష్ట పరిహారాలు స్వరాష్ట్రంలో అందడం లేదంటూ భట్టి చేస్తున్న విమర్శలు రాజకీయ చర్చను వేడెక్కించాయి. నల్గొండ జిల్లాలో ఈనెల 22 వరకు భట్టి పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో భట్టి వర్సెస్ జగదీష్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు మధ్య మాటల యుద్ధం మరింత ముదరనుండటం ఆసక్తికరంగా మారనుంది.