అవినీతితోనే కుంగుబాటు.. గుర్తించిన ఎన్‌డీఎస్ఏ క‌మిటీ

మేడిగ‌డ్డ బారాజ్ కుగుంబాటుకు అవినీతి, అధికారుల‌ నిర్ల‌క్ష్యం, మాన‌వ త‌ప్పిదాలేన‌ని నేష‌న‌ల్ డ్యామ్ స్టేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్ఏ) ఏర్పాటు చేసిన క‌మిటీ తేల్చి చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది

అవినీతితోనే కుంగుబాటు.. గుర్తించిన ఎన్‌డీఎస్ఏ క‌మిటీ
  • కాళేశ్వరం అక్రమాలపై విచారణ
  • 1850లో కట్టిన దవళేశ్వరం నిర్మాణం పరిశీలన
  • అంతకు 50ఏళ్ల క్రితం నాటి ఇంజనీర్ జేమ్స్ నిర్మాణాలతో విశ్లేషణ
  • మానవ తప్పిదాలు, అవినీతి, అధికారుల నిర్లక్ష్యమే కుంగుబాటుకు కారణమని తేల్చిన కమిటీ


విధాత: మేడిగ‌డ్డ బారాజ్ కుగుంబాటుకు అవినీతి, అధికారుల‌ నిర్ల‌క్ష్యం, మాన‌వ త‌ప్పిదాలేన‌ని నేష‌న‌ల్ డ్యామ్ స్టేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్ఏ) ఏర్పాటు చేసిన క‌మిటీ తేల్చి చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్, డిజైన్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ అండ్ ఇనిస్పెక్ష‌న్‌, ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఇలాప్రతి స్టేజ్‌లో నిర్లక్ష్యం ఉందని నిపుణుల కమిటీ తేల్చింది.


కాళేశ్వ‌రం కుంగుబాటు మ‌రో సారి ప‌రిశీలించిన చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలోని క‌మిటీ బుధ‌వారం జ‌ల‌సౌధ‌లో నీటి పారుద‌ల శాఖ ఇఎన్సీతో పాటు ఇత‌ర సీనియ‌ర్‌ అధికారుల‌తో స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశానికి కాంట్రాక్టు సంస్థ అయిన ఎల్‌ఆండ్‌టీ ప్రతినిధులను పిలిపించింది. ఈఎన్సీ జనరల్, డిజైన్స్, హైడ్రాలజీ అధికారులతోనూ భేటీ అయ్యారు. మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ను కూడా ఎన్‌డీఎస్‌ఏ కమిటీ పిలిపించింది. వారందరితో కమిటీ విడివిడిగా భేటీ అయింది.


కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్మాణాలు జరిగిన తీరుపై విచారించింది. వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ది. క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్‌ ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సహా ప్రతి స్టేజిలో నిర్లక్ష్యం ఉందని నిపుణుల కమిటీ దృవీక‌రించుకున్న‌ట్లు స‌మాచారం. పలు సందర్భాల్లో పెద్దల పేర్లు చెప్పి అప్పటి ఈఎన్‌సీ మురళీధర్ ప్రమేయం లేకుండానే కీలక ఫైల్స్ మూవ్ చేసినట్లు గుర్తించింది. ఈ సంద‌ర్భంగా క‌మిటీ 1850లో కట్టిన ధవళేశ్వరం బ్యారేజ్, అంతకు 50 ఏళ్ళ ముందు బ్రిటిష్ కాలం నాటి ఇంజనీర్ జేమ్స్ నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు తెప్పించుకొని పరిశీలన చేసింది.


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలతో వాటిని పోల్చిచూసింది. చెన్నై పురావ‌స్తు శాఖ‌లో ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను తెప్పించి పరిశీలించిన కమిటీ మానవ తప్పిదాలు, అవినీతి, అధికారుల నిర్లక్ష్యమే ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమని ప్రాథమికంగా గుర్తించింది. ప్రాజెక్ట్ 100శాతం పూర్తికాకుండానే 2019లో ప్రాజెక్టు పూర్తయినట్టుగా ఆగమేఘాలపై క్లియరెన్స్ నిర్మాణ సంస్థ‌ సర్టిఫికెట్ పొందిన తీరుపై ఆపేక్షించిన‌ట్లు స‌మాచారం.