Tamilisai రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై చురక వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి వరంగల్ నగరంలో గవర్నర్ పర్యటన వరద బాధితులకు నిత్యవసరాలు మందుల పంపిణీ గవర్నర్కు స్వాగతం పలికిన కలెక్టర్లు స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదేపదే తీవ్రమైన వరద ముంపు సంఘటనలు జరుగుతున్నా, శాశ్వత పరిష్కారం చూపెట్టడంలో తగిన శ్రద్ధ కనబరచడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పరోక్షంగా చురక వేశారు. దీర్ఘకాలికంగా […]
Tamilisai
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదేపదే తీవ్రమైన వరద ముంపు సంఘటనలు జరుగుతున్నా, శాశ్వత పరిష్కారం చూపెట్టడంలో తగిన శ్రద్ధ కనబరచడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పరోక్షంగా చురక వేశారు. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల కారణంగానే ప్రభావం తీవ్రంగా ఉందని స్థానికులు వివరించినట్లు ఆమె ఉదాహరించారు.
వరంగల్ పర్యటనలో భాగంగా బుధవారం నిట్కు గవర్నర్ తమిళిసై చేరుకున్నారు. నిట్లో గవర్నర్కు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. హనుమకొండలోని జవహర్ నగర్, పోతన నగర్, భద్రకాళి బండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆమె భధ్రకాళిలో ప్రత్యేక పూజ చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
సమస్యల పట్ల జాప్యం
హనుమకొండలోని జవహర్ నగర్ ప్రాంతంలో అధిక ప్రాంతం ముంపు గురై ,ఇక్కడి బ్రిడ్జి బాగా దెబ్బతిన్నట్టు ఆమె తెలిపారు. బ్రిడ్జి పనులు వెంటనే మరమ్మతు చేపట్టి నీరు సాఫీగా వెళ్లిపోవడానికి అధికారులు చొరవ తీసుకొని సహకరించాలని గవర్నర్ కోరారు. గతంలో పలుమార్లు స్థానికులు ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య అలాగే ఉండడాన్ని ఆమె తప్పు పట్టారు. కురిసే వర్షాన్ని ఆపలేం జరిగే నష్టాన్ని మాత్రం ఆపే అవకాశాలు మన చేతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా మానవ తప్పిదం మూలంగా జరిగే నష్టాలను నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలి
సమస్యకు దీర్ఘకాలిక దృష్టితో శాశ్వత పరిష్కారం చూపెట్టినప్పుడే తగిన ఫలితాలు ఉంటాయని ఆమె అన్నారు. స్థానిక అధికారులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ వారికి పైనుంచి అందాల్సిన సహకారం లేకపోవడంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి అంటూ ఒక విధంగా ప్రభుత్వాన్ని ఎత్తి చూపారు. భారీ వర్షాల మూలంగా వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు తీవ్రమైన వరద ముంపుకు గురయ్యాయని, ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు.
రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం
హనుమకొండ రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై అన్నారు. వర్షాలతో ముంపునకు గురైన వరద బాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు, మందులు పంపిణీ చేశారు. వరదలను సోషల్ మీడియాలో చూసి బాధితులను ఆదుకోవాలని ఆదేశించగానే రెడ్ క్రాస్ సభ్యులు స్పందించారని, అనేక స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలు చేశాయని వారిని అభినందించారు.
మరింత శ్రద్ధ పెట్టాలి
వరద ముంపుకు గురైన సమయంలో కంటే, తరువాత ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఎక్కువ దృష్టి పెట్టాలని గవర్నర్ కోరారు. సర్వం కోల్పోయిన ప్రజలు తిండి, నీరు, సామాన్లు, ఉండేందుకు ఇల్లు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. వరద ముంపు ప్రాంతాలలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని నష్టాన్ని అంచనా వేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆమె వివరించారు. అనంతరం ఆమె హైదరాబాద్ తిరిగి వెళ్ళారు.