New Rules-Deadlines | ఫిబ్రవరి ఒకటి నుంచి మారనున్న రూల్స్..!
ఈ ఏడాది క్యాలెండర్లో మరో నెల ముగిసింది. ఈ క్రమంలో పలు రూల్స్ మారనున్నాయి. ఫిబ్రవరి నుంచి పలు మార్పులు చోటు చేసుకుబోతున్నాయి

- అవేంటో తెలుసుకుందాం రండి..! లేకపోతే మీకే నష్టం..!
New Rules-Deadlines | ఈ ఏడాది క్యాలెండర్లో మరో నెల ముగిసింది. ఈ క్రమంలో పలు రూల్స్ మారనున్నాయి. ఫిబ్రవరి నుంచి పలు మార్పులు చోటు చేసుకుబోతున్నాయి. పలు పథకాలకు సంబంధించిన గడువు సైతం ముగియబోతున్నది. ఫిబ్రవరిలో ఎన్పీఎస్ విత్డ్రా రూల్స్ మారడంతో పాటు సావరిన్ గోల్డ్ బాండ్ పథకం, స్టేట్ బ్యాంక్ హోంలోన్ ఆఫర్, ఫాస్టాగ్ గడువు జనవరి 31తో గడువు ముగియనున్నది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఏ అంశాల్లో మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం రండి..!
సావరిన్ గోల్డ్ స్కీమ్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ చివరి విడతను ఫిబ్రవరిలో ప్రకటించనున్నది. సబ్స్క్రిప్షన్ 2024 ఫిబ్రవరి 12న ఓపెన్ అవనున్నది. అదే నెల 16న ముగియనున్నది. ఇంతకు ముందు 2023 డిసెంబర్లో స్కీమ్ విడుదలైంది. ఆ సమయంలో బంగారం ధరను గ్రాముకు రూ.6,199గా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఫిబ్రవరిలో గ్రాము బంగారం ధరను ఆర్బీఐ ప్రకటించనున్నది.
నగదు విత్డ్రా నిబంధన : పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఇటీవల ఓ సర్క్యూలర్ను విడుదల చేసింది. నేషనల్ పెన్షన్ అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్డ్రా చేసుకోవడానికి (partial withdrawal of pension) కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఎన్పీఎస్ అకౌంట్లో ఉన్న డబ్బులో యాజమాన్యం వాటాను మినహాయించి.. చందాదారులు కట్టే వాటా నుంచి మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా 25శాతం ఉపసంహరణకు మాత్రమే అవకాశం ఉంటుంది. మొదటి ఇంటి కొనుగోలు, నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
ఫాస్టాగ్ కేవైసీ : కేవైసీ లేని అన్ని ఫాస్టాగ్లు ఫిబ్రవరి ఒకటి నుంచి డీయాక్టివేవ్ కానున్నాయి. జనవరి 31 లోగా ఫాస్టాగ్ యూజర్లందరూ తప్పనిసరిగా తమ ఫాస్టాగ్ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్కు అనుసంధానమైన మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బున్నా.. ఈ-కేవైసీ చేయకపోతే ఇకపై పని చేయవు. దేశంలో 7కోట్ల వరకు ఫాస్టాగ్ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 4కోట్ల కేవైసీలు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో 1.2కోట్ల డూప్లికేట్ ఫాస్టాగ్లు సైతం వినియోగంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయా ఫాస్టాగ్లు ఈ కేవైసీ చేయకపోతే డీయాక్టివేట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నారు.
ఎస్బీఐ హోంలోన్ ఆఫర్ : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ క్రెడిట్ స్కోర్ ఆధారంగా గృహ రుణాలపై ప్రత్యేకంగా రాయితీ ఇస్తున్నది. 650 బీపీఎస్ కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేట్లకు హౌసింగ్ లోన్ అందిస్తున్నది. హోం లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజు, రాయితీ ఇస్తుండగా గడువు 31 జనవరితో ముగుస్తున్నది. ఫ్లెక్సీ ప్లే, ఎన్ఆర్ఐ, నాన్ సాలరీడ్, ప్రివిలేజ్ ఆపాన్ ఘర్ కస్టమర్లకు ఈ రాయితీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో సిబిల్ స్కోర్ ఆధారంగా హోంలోన్ వడ్డీ రేట్లలో మార్పులుంటాయి.
ధన్ లక్ష్మి ఎఫ్డీ స్కీమ్ : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) ప్రస్తుతం ‘ధన్ లక్ష్మి 444 డేస్’ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ అమలు చేస్తున్నది. ఈ డిపాజిట్ స్కీమ్ గడువు జనవరి 31తో ముగుస్తున్నది. పేరుకు తగ్గట్లే ఈ టర్మ్ డిపాజిట్ కాల వ్యవధి 444 రోజులు కాగా.. ఇందులో వడ్డీ రేటు 7.4శాతం ఉంటుంది. సూపర్ సీనియర్లు 8.05శాతం చెల్లిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గడువు గతేడాది నవంబర్తో 30 ముగిసింది. స్కీమ్కు మంచి ఆదరణ లభిస్తుండడంతో జనవరి 31 వరకు పొడిగించారు.