రాష్ట్రంలో అకాల వర్షాలు రైతన్నను నిండాముంచాయి. శుక్రవారం మొదలైన వాన శనివారం సైతం కొనసాగింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతన్నను నిండాముంచాయి. శుక్రవారం మొదలైన వాన శనివారం సైతం కొనసాగింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. అయితే టార్పాలిన్లు లేకపోవడంతో వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వారం రోజులైనా ధాన్యం కాంటా అవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంట నష్టపోయి రైతులు అల్లాడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లోనూ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలు నీట మునిగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. నిన్నటి వరకు తీవ్రమైన ఎండ వడ గాలులతో ఇబ్బంది పడ్డ జనానికి వర్షం పశమనం కలిగించినప్పటికీ రైతాంగానికి నష్టం వాటిల్లింది.
నష్టపోయిన రైతుల ఆవేదన
మరోవైపు అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట పొలంలోనే నీళ్లపాలవుతోందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పంట కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే వర్షానికి ధాన్యమంతా తడిసి ముద్దయిపోయిందని వాపోతున్నారు. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమని ఆదుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం
వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు కాజీపేటతోపాటు ధర్మసాగర్, వేలేరు, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్లో, తరిగొప్పుల మండలంలో భారీ వర్షం కురవడంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలం ఉప్పుగల్లు, తిమ్మంపేటతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిముద్దయ్యాయి. కాగా, ఈదురు గాలులతో చెట్లు నేలకొరకగా, పలుచోట్ల కరంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా, వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది.