Pawan Kalyan | పొత్తులతోనే పార్టీ బలపడుతుంది.. ఈ CM అక్కర్లేదు.. దించేద్దాం

Pawan Kalyan అన్నీ కుదిరితే టిడిపి, బిజెపి, జనసేన కలిసి వెళ్తాయి.. విధాత‌: రానున్న ఎన్నికల్లో కచ్చితంగా జనసేన టిడిపితో పొత్తు పెట్టుకుంటుంది అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి తనకు ప్రధాన ప్రత్యర్థి అని, జగన్ను పదవిలోంచి దించడమే తన లక్ష్యం అని చెప్పిన పవన్ అన్నీ కుదిరితే బిజెపితో సైతం పొత్తు ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ పార్టీల బలాబలాలను బట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనేది ఉంటుందన్నారు.. […]

  • Publish Date - May 12, 2023 / 02:44 PM IST

Pawan Kalyan

  • అన్నీ కుదిరితే టిడిపి, బిజెపి, జనసేన కలిసి వెళ్తాయి..

విధాత‌: రానున్న ఎన్నికల్లో కచ్చితంగా జనసేన టిడిపితో పొత్తు పెట్టుకుంటుంది అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి తనకు ప్రధాన ప్రత్యర్థి అని, జగన్ను పదవిలోంచి దించడమే తన లక్ష్యం అని చెప్పిన పవన్ అన్నీ కుదిరితే బిజెపితో సైతం పొత్తు ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ పార్టీల బలాబలాలను బట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనేది ఉంటుందన్నారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే…

కచ్చితంగా అలయన్సే ఉంటుంది. వైసీపీనే మనకు ప్రత్యర్థి. అధికారం నుంచి ఈ ముఖ్యమంత్రిని తీసేయాల్సిందే. అన్ని పద్ధతులు బాగుంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. అలయన్స్ కు సిద్ధం అనే ప్రకటించాను తప్ప.. విధివిధానాలు ఇంకా ప్రకటించలేదు.

అలయన్స్ పై నాలుగు గోడల మధ్య ఒప్పందాలు చేసుకోం.. ప్రజల మధ్యే ఒప్పందాలు చేసుకుంటాం. త్రిముఖ పోటీలో బలి కావడానికి నేను ఈసారి సిద్ధంగా లేను. ఎవరు ముఖ్యమంత్రి అనేది.. ఆరోజు బలాబలాల‌ను బట్టి ఎన్నికల తర్వాత మాట్లాడదాం. వైసీపీని గద్దె దించడం.. అలయన్స్ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించడమే మన లక్ష్యం..

సీట్లు వచ్చిన తర్వాతే.. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి మాట్లాడదాం. మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధికంగా ఓట్ల శాతం వస్తే.. మాట్లాడటానికి హక్కు ఉంటుంది. రాజకీయాల్లో ప్రాథమిక టార్గెట్ ఎవరు.. నీ ప్రత్యర్థి ఎవరు.. అనేది నిర్ణయించుకోవాలి. అలయన్స్ ను తక్కువ అంచనా వేయవద్దు..

రాజకీయాల్లో అహంకారం వద్దు.. వ్యూహాలే కావాలి. ఏపీలో ఇప్పుడు కావాల్సింది నాయకులు కాదు.. పరివర్తన కావాలి. మన బలమేందో మనం బేరేజు వేసుకోవాలి. నమ్మకం ఉన్నది. జనసేన ఓటింగ్ 14 నుంచి 18 శాతం ఉంది.

కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు సగటున 20 శాతం. గోదావరి జిల్లాలను తీసుకుంటే 30 శాతం ఓటింగ్ ఉంది. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా.. మీరు నిర్ణయించండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం కాదు. కేవలం ఎన్నికల్లో పోటీ చేసే బలమే.. ఇంకోసారి నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. కచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి.

మీకు నచ్చినా, నచ్చకపోయినా త్రిముఖ పోటీల్లో జనసేన బలి కావడానికి.. నేను ఈసారి సిద్ధంగా లేను. ఆలూ లేదు చూలు లేదు అన్నట్టు… మనకు ఓట్లే లేనప్పుడు.. ముఖ్యమంత్రి అభ్యర్థా.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని కలలు కనండి.. కానీ, గాలిలో మేడలు కట్టొద్దు.

2014లో భుజం కాశాం.. సరిగ్గా చేయలేకపోతే నిలదీశాం. నేను ఏమీ అడగకుండా మద్దతిస్తానా.. అంత పిచ్చివాడినా.. ఎవరి వద్దా బిచ్చం ఎత్తుకునే వాడిని కాదు.. అందుకే పార్టీ ఆఫీసుకు స్థలం కూడా అడగలేదు. సకల కళా కోవిదుడు విమర్శలు చేస్తున్నాడు. కాపుల్ని ఛీ కొట్టినప్పుడు వైసీపీకి ఎందుకు ఓట్లు వేశారు. వైసీపీలో పొట్టి పొట్టి అడుగులు వేసే వారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించమనండి.

ఎమ్మెల్యేలనే ఇవ్వలేదు.. సీఎం పదవి ఎలా వస్తుంది. 134 సీట్లల్లో పోటీ చేస్తే.. కనీసం 30-40 గెలిచినా సీఎం అయ్యేవాళ్ళం… ఇక్కడ కంటే.. కర్ణాటక వెళితే నాకు రోడ్లు కిక్కిరిసిపోయేలా జనం వస్తారు.. అభిమాన బలం ఒక్కటే కాదు.. ఓట్లుగా మారాలి. భీమ్లా నాయక్ సినిమాను కక్ష గట్టి ఆపేస్తే.. 30 కోట్ల నష్టం వచ్చింది. ముఖ్యమంత్రిని చేసేస్తారు.. అని మనకు భేషజాలు వద్దు.

ఎంఐఎం పార్టీలా కనీసం 7 స్థానాల్లో కూడా గెలిపించలేదు. ఏదైనా మాట్లాడితే.. మీ ఇళ్ళల్లోకి వచ్చి రేప్ చేస్తామన్నది వైసీపీ సంస్కృతి.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులు వేరు.. వీళ్ళది ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం.. మీ శత్రువు ఎవరో మీరు టార్గెట్ చేయండి.

రోడ్లు వేయని వ్యక్తి.. రైతులకు న్యాయం చేయని వ్యక్తి.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వని వ్యక్తి.. ఈ ఎన్నికల్లో వైసీపీ మనకు ప్రత్యర్థి. నాకు ఒక్కరికే కాదు. మనకు నచ్చని వ్యక్తి అధికారంలో ఉంటే.. అతన్ని తీసేయాల్సిందే. నా జీవితంలో శత్రుత్వం పెట్టుకోని వ్యక్తిని. నేను నమ్ముకున్న నా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తే తాట తీసి కూర్చోబెడతాను. వీళ్ళని ప్రత్యర్థిగా ప్రకటిస్తామా.. టీడీపీని ప్రత్యర్థిగా ప్రకటిద్దామా..

చిత్తశుద్ధి లేని శివ పూజలెందుకు.. గోదావరిలో మునగడం ఎందుకు.. హెలికాఫ్టర్ లో వెళుతూ.. కింద పచ్చటి చెట్లను కొట్టించే వ్యక్తి అతను. ప్రజల్లో పచ్చదనాన్ని చంపేశాడు.. దారిపొడవునా చెట్లను నరికేశాడు. అడ్డగోలుగా డబ్బులు సంపాదించి.. ఆ డబ్బుతో గూండాలను, అధికారులను కొనేసి, మనల్ని బెదిరించిన వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ జీవితంలో కోలుకోదు. అన్నారు

Latest News