ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 25న హోళీ పండుగ రోజున ఏర్పడబోతున్నది. ఈ సంవత్సరం ఐదు గ్రహణాలు ఏర్పడనుండగా.. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి.
Lunar Eclipse | ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 25న హోళీ పండుగ రోజున ఏర్పడబోతున్నది. ఈ సంవత్సరం ఐదు గ్రహణాలు ఏర్పడనుండగా.. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మూడు చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఈ నెల 25న ఏర్పడబోయే గ్రహణాన్ని పెనంబ్రల్ చంద్రగ్రహణంగా పిలుస్తున్నారు. సాయంత్రం 6.45 గంటలకు చంద్రోదయం అవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉదయం 10.23 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3.10 గంటల వరకు కొనసాగుతుంది. దాదాపు 4.35 గంటల పాటు కొనసాగనున్నది.
ఈ గ్రహణం ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటిక్ , అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో దర్శనమివ్వనున్నది. అయితే, భారత్లో గ్రహణం కనిపించకపోవడం వల్ల గ్రహణ సూతకం చెల్లదని.. ఆ రోజున శుభకార్యాలు జరుపుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. సాధారణంగా భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చిన సయంలో గ్రహణాలు ఏర్పడుతుంటాయి. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడుతుంది. ఆ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు కనిపించడు. ఇది కేవలం పౌర్ణమి రోజుల్లోనే సాధ్యమవుతుంది. ఫలితంగా పౌర్ణమిరోజు పూర్ణ చంద్రుడు గ్రహణ సమయంలో కనిపించకుండాపోతాడు.
అంతేకాకుండా గ్రహణానికి ముందు ఎరుపు రంగులో చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం చంద్రుడిపై ప్రతిబింబించడంతో ఎర్రగా కనిపిస్తుంది. ఈ నెల 25న ఏర్పడనున్న పెనంబ్రల్ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లుగా కనిపించనున్నాడు. ఎందుకంటే, ఏర్పడబోయే చంద్రగ్రహణంలో భూమి కోణం 5 డిగ్రీల ఎత్తులో ఉంటుంది. దాంతో భూవాతావరణ ప్రభావం చంద్రుడిపై ఉండదు కాబట్టి గ్రహణం తేలికైన రంగులో కనిపిస్తుంది. పాక్షిక, సంపూర్ణ గ్రహణాల కంటే దీన్ని గుర్తించడానికి నిశిత పరిశీలన అవసరం అవుతుంది. అందువల్ల ఈ చంద్రగ్రహణం తరచుగా ఏర్పడే ‘అంబ్రల్’ కాకుండా పెనంబ్రల్ చంద్రగ్రహణంగా పిలుస్తారని పరిశోధకులు పేర్కొన్నారు.