Pilli Ramaraju Yadav బలహీనవర్గాల ప్రతినిధిగా పోటీ ఖాయం విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి దీటుగా సొంతంగా తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న బిఆర్ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్ (Pilli Ramaraju Yadav) వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలోనే పార్టీ పరంగా జనంలోకి వెళ్తున్నానంటూ చెబుతున్న […]
Pilli Ramaraju Yadav
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి దీటుగా సొంతంగా తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న బిఆర్ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్ (Pilli Ramaraju Yadav) వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలోనే పార్టీ పరంగా జనంలోకి వెళ్తున్నానంటూ చెబుతున్న రామరాజుకు బిఆర్ఎస్ నుండి టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు.
టికెట్ రాకపోయినా తాను వచ్చే ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో నుంచి బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా , ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతుతో పోటీ చేయడం ఖాయం అంటు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పోటీ చేయడం తధ్యమని రామరాజు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల క్రమంలో బిఆర్ఎస్ టికెట్ల కోసం ఆ పార్టీ అధిష్టానం వైఖరితో నిమిత్తం లేకుండా ఒక బిఆర్ఎస్ నేత పోటీ ఖాయమంటూ విస్పష్టమైన వైఖరి వెల్లడించిన ఘటన ప్రస్తుతం తెలంగాణలో నల్గొండ సెగ్మెంట్ లోనే చోటు చేసుకోవడం గమనార్హం.
నకిరేకల్ లో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు పోటీగా వేముల వీరేశం కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయం అంటూ రామరాజు తరహాలోనే స్పష్టం చేస్తుండటం మరో ఆసక్తికర పరిణామం.
ఇకపోతే రామరాజు పోటీ నిర్ణయంతో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ఒకవైపు కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు సొంత పార్టీ రెబల్ నేత పిల్లి రామరాజు తోను గట్టి పోటీ ఎదురవ్వనుంది.
ఇప్పటికే రామరాజు కొన్ని నెలలుగా నిత్యం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ జనంలోకి వెళుతూ కష్టనష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయాలు, గుడులకు, క్రీడా పోటీలకు విరాళాలు, శుభ కార్యాలు, పండుగలకు సహాయాలు చేస్తూ చాప కింద నీరులా రామరాజు తన బలం, బలగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు.
నియోజకవర్గంలో బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గం నుండి బలమైన నేతగా ఎదిగిన రామరాజు ఇప్పుడు బలహీన వర్గాల శక్తిగా మారిపోయాడు. స్థానికుడైన తాను బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు రామరాజు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో కంచర్ల, కోమటిరెడ్డి, రామరాజుల మధ్య త్రిముఖ పోటీకి బీజం పడినట్లయ్యింది.
ప్రధాన పోటీ దారులుగా ఉన్న కంచర్ల, కోమటిరెడ్డిల మధ్య బిసి సామాజిక వర్గం అస్త్రంతో రామరాజు త్రిముఖ పోటీ పరిస్థితిని సృష్టించడంలో ఇప్పటికే సఫలీకృతుడయ్యాడు. దీంతో 1952 నుండి చూస్తే నల్గొండ సెగ్మెంట్ ఎన్నికల చరిత్రలో 1962 ఎన్నికల్లో గెలిచిన బి.ధర్మభిక్షం, 1985ఎన్నికల్లో గెలిచిన దివంగత సీఎం ఎన్.టి. రామారావు మినహాయిస్తే బీసీ అభ్యర్థుల నుండి గట్టి పోటీ దారులు లేని కొరతను రామరాజు తీర్చవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు బిజెపి నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ కూడా బీసీ కోటాలో పార్టీ టికెట్ పై గట్టి ఆశలే పెట్టుకోగా ఆయనకు పోటీగా నాగం వర్షిత్ రెడ్డి, కన్మంత రెడ్డి శ్రీదేవిలు సైతం టికెట్ ఆశిస్తున్నారు. స్థానికుడిగా, బీసీ బిడ్డగా మాదగోనికి టికెట్ ఇస్తేనే స్థానికేతరులైనటువంటి రెడ్డి సామాజిక వర్గంకు చెందిన కంచర్ల, వెంకటరెడ్డిలకు గట్టి పోటీ ఇస్తాడంటు ఆయన వర్గీయులు వాదిస్తున్నారు.
మాదగోనికి బిజెపి టికెట్ వస్తే అప్పుడు రామారాజుతో కలిపి ఇద్దరు బీసీ నేతలు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలైన కంచర్ల, కోమటిరెడ్డి ల మధ్య చతుర్ముఖ పోటీ పరిస్థితులు ఉత్పన్నమవ్వనున్నాయి. ప్రస్తుతానికి రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నా ఎన్నికల నాటికి ఏ పార్టీల తరఫున ఎవరెవరు పోటీ చేస్తారన్నది స్పష్టమైతేనే వారిలో ప్రధాన పోటీదారులు ఎవరు.. విజేత ఎవరో జనమే తేల్చనున్నారు.