విధాత : నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ (Pilli Ramaraju Yadav) మంగళవారం బిజెపి పార్టీలో చేరారు.. కార్యకర్తలు అనుచరుల తో కూడిన భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ కు ర్యాలీగా చేరుకున్న రామరాజు యాదవ్ కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.
బిజెపిలో తన చేరిక సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రధాని మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై తాను బిజెపిలో చేరానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమంది ఎన్ని విధాల ఇబ్బంది పెట్టిన ప్రజలు నాకు మద్దతుగా దాదాపు 30వేల ఓట్లు వేయడం జరిగిందన్నారు. నల్గొండ పార్లమెంట్లో బిజెపి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత నల్గొండ మున్సిపాలిటీ పై దృష్టి పెడతానని చెప్పారు. నల్గొండలో నా ఎదుగుదలను ఓర్వలేక చాలామంది నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, అభివృద్ధి కోసం తన జీవితాంతం ఆత్మగౌరవంతో పనిచేస్తానన్నారు పదవుల కోసమో, డబ్బుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు.
నల్లగొండ లో నన్ను అడ్డుకోవడం కోసం హేమాహేమీ నాయకులు అక్రమ కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారనీ, వాటన్నింటినీ తిప్పి కొట్టి ప్రజల పక్షనే కొట్లాడుతానన్నారు. రాష్ట్ర ప్రజలు అహంకారపురిత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరోగ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతుందన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే బిజెపి పార్టీలో నేను ఒకడిగా కొనసాగనుండటం ఆనందంగా ఉందన్నారు.