ప్రాచీన భారతదేశంలో నేటి మినీ స్కర్టులు
మినీ స్కర్టులు అంటే ఇదేదో కొత్త ఫ్యాషన్ అని, విదేశాల్లోంచి మనకు దిగుమతి అయిందని అనుకుంటాం. కానీ.. ప్రాచీన భారతదేశంలో మినీ స్కర్టులను వాడారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.

- కోణార్క్ స్తూపాలపై కనిపిస్తాయయి
- ఫ్యాషన్లో ప్రాచీన భారతదేశం ఆద్యురాలు
- అవార్డుల ప్రదానోత్సంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మినీ స్కర్టులు అంటే ఇదేదో కొత్త ఫ్యాషన్ అని, విదేశాల్లోంచి మనకు దిగుమతి అయిందని అనుకుంటాం. కానీ.. ప్రాచీన భారతదేశంలో మినీ స్కర్టులను వాడారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో తొలి ‘జాతీయ సృష్టికర్తల అవార్డు’ల ప్రదానోత్సవంలో మాట్లాడిన మోదీ.. కోణార్క్ ఆలయంలోని అనేక స్తూపాలపై మినీ స్కర్టులు ధరించి ఉండటం కనిపిస్తుందని తెలిపారు. ఫ్యాషన్ విషయానికి వస్తే.. భారతదేశమే ఆద్యురాలని చెప్పారు.
భారతీయ వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ‘చాలా మంది మినీ స్కర్టులు ఆధునికతకు గుర్తు అని భావిస్తారు. కానీ.. మీరు కోణార్క్ వెళ్లి అక్కడి ఆలయాల్లోని శతాబ్దాల పూర్వం నాటి స్తూపాలను గమనించండి. మినీస్కర్టులతోపాటు వాళ్ల చేతిలో పర్సులు కూడా కనిపిస్తాయి’ అని తెలిపారు.
పురస్కారాలు అందుకున్నవారిలో 19 ఏళ్ల జాహ్నవిసింగ్ కూడా ఉన్నారు. భారతీయ వస్త్రాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, సంస్కృతి తదితర అంశాలపై ఆమె పనిచేస్తున్నారు. ఆమెకు హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును ప్రధాని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శతాబ్దాల క్రితమే మన శిల్పులకు ష్యాషన్ గురించిన అవగాహన ఉండేదని చెప్పారు. ప్రస్తుతకాలంలో రెడీమేడ్ దుస్తులకు అలవాటు పడుతున్న అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వస్త్రాలకు బలమైన ప్రాచుర్యం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.