మూవీ పేరు: ‘పొన్నియిన్ సెల్వన్ 1’విడుదల తేదీ: 30, సెప్టెంబర్ 2022నటీనటులు: విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ్ల మాటలు: తనికెళ్ల భరణి, బి. జయమోహన్సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్సంగీతం: ఏ.ఆర్. రెహమాన్నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్కథ, స్క్రీన్ప్లే: మణిరత్నం విధాత: దర్శకుడు మణిరత్నం సినిమాలకు ఫ్యాన్స్ కాదు.. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది తెలియని విషయమేం కాదు. దర్శకుడిగా […]
మూవీ పేరు: ‘పొన్నియిన్ సెల్వన్ 1’
విడుదల తేదీ: 30, సెప్టెంబర్ 2022
నటీనటులు: విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ్ల
మాటలు: తనికెళ్ల భరణి, బి. జయమోహన్
సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్
కథ, స్క్రీన్ప్లే: మణిరత్నం
విధాత: దర్శకుడు మణిరత్నం సినిమాలకు ఫ్యాన్స్ కాదు.. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది తెలియని విషయమేం కాదు. దర్శకుడిగా ఆయన ఎందరికో స్ఫూర్తి. తన దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుందంటే.. అది గ్రాండియర్గా ఉండబోతుందనే అర్థం. హిట్, ఫ్లాప్లు సంగతి పక్కన పెడితే.. కొత్తగా ఏదో ఒక విషయం మాత్రం ఆయన సినిమాలలో ఉంటుంది. అలాంటిది ఇప్పుడాయన డ్రీమ్ ప్రాజెక్ట్తో వస్తున్నాడంటే ఎటువంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల.. తమిళనాట అత్యంత ఆదరణ పొందిన నవలగా ప్రసిద్ధి పొందింది. ఈ నవల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ను తెరకెక్కించాలనేది మణిరత్నం డ్రీమ్. ఆ డ్రీమ్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రమోషన్ కానీ, పరిచయమవుతున్న పాత్రలు కానీ.. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను.. ‘పీఎస్ 1’ అందుకుందో.. లేదో.. రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కథగా చెప్పాలంటే ఇందులో చాలా ఉంది. చెప్పినా ఎవరికీ అర్థం కాదు. చోళ చక్రవర్తి అయిన సుందర చోళుడు (ప్రకాశ్ రాజ్)కు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. వారి పేర్లు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరుణ్ మొళి వర్మన్ (జయం రవి), కుందవై (త్రిష). ఇద్దరు కుమారులు ఎవరి రాజ్యాన్ని వారు పాలిస్తూ ఉంటారు. కుందవై మాత్రం తన తండ్రి దగ్గరే ఉంటుంది.
ఆదిత్య కరికాలన్ తన తండ్రి రాజ్యంలో జరగకూడనిది ఏదో జరుగుతుందని తలచి.. అదేమిటో తెలుసుకు రమ్మని వందియదేవన్ (కార్తి)ని పంపుతాడు. ఆదిత్య కరికాలన్ కోరిక మేరకు తంజావూరు బయలు దేరిన వందియదేవన్.. ఆదిత్య కరికాలన్ తండ్రి రాజ్యంలో ఓ కుట్ర జరుగుతున్నట్లుగా తెలుసుకుంటాడు. ఆ కుట్ర కుందవై కూడా పసి గడుతుంది. వెంటనే సోదరుడు అరుణ్ మొళి వర్మన్ను రాజ్యానికి రమ్మని కబురు పంపుతుంది.
కుట్ర విషయం తెలుసుకున్న వందియదేవన్ను, అరుణ్ మొళి వర్మన్ను చంపేయమని పళవేట్టురాయర్ (శరత్ కుమార్) సైనికులను పంపుతాడు. అసలు పళవేట్టురాయల్ ఎవరు? సుందరచోళుడి రాజ్యంలో వందియదేవన్, కుందవై, అరుణ్ మొళి వర్మన్ పసిగట్టిన కుట్ర ఏమిటి? పళవేట్టురాయల్ పంపిన సైన్యాన్ని వందియదేవన్, అరుణ్ మొళి వర్మన్ ఎలా ఎదుర్కొన్నారు? అసలు నందిని (ఐశ్వర్యరాయ్) ఎవరు? ఆమెకు, ఈ కథకు ఉన్న సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ విజువల్ వండర్ని చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
సినిమా పేరు ప్రకారం అరుణ్ మొళి వర్మన్గా ఇందులో జయం రవి నటించాడు. అతనే పొన్నియిన్ సెల్వన్ అన్నట్లుగా కథ సాగుతుంది. అయితే ఈ పార్ట్ వరకు మాత్రం హీరో కార్తి (వందియదేవన్) పాత్రకే మంచి ఇంపార్టెన్స్, ఎంటర్టైన్మెంట్ జోడించారు. ఆ రెండింటికి కార్తి పూర్తి న్యాయం చేశాడు. కామెడీ కూడా చేసి ప్రేక్షకులను నవ్విస్తాడు. సినిమా మొదట్లో విక్రమ్ పాత్రకు మంచి ప్రాముఖ్యతను ఇచ్చారు. విక్రమ్ గురించి చెప్పేదేముంది. ఏ పాత్రలో అయినా విక్రమ్ విజృంభించేయగలడు.
అరుణ్ మొళి వర్మన్ పాత్రలో చేసిన జయం రవికి ఫస్టాఫ్లో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కానీ.. సెకండాఫ్లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి. టైటిల్ పాత్రకు జయం రవి పర్ఫెక్ట్ అన్నట్లుగా తన నటనతో అలరించాడు. త్రిష, ఐశ్వర్యారాయ్లు ఈ సినిమాకు గ్లామర్ అద్దడంతో పాటు.. నటనతోనూ మెప్పించారు. ముఖ్యంగా నందిని పాత్రకున్న వైవిధ్యత ఈ సినిమా హైలెట్స్లో ఒకటి. ఆమె కూడా చక్కని అభినయం కనబరిచింది. ఇంకా ఇతర పాత్రలలో చేసిన ప్రకాశ్ రాజ్, శోభిత, ఐశ్వర్య లక్ష్మీ, పార్థీబన్, శరత్ కుమార్ వంటివారి పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు.. కానీ ఉన్నంతలో వారి నటనతో ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగానికి వస్తే.. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ కెమెరా. ప్రతి సన్నివేశాన్ని రవివర్మన్ కెమెరాతో అద్భుతంగా చిత్రీకరించాడు. అలాగే 9వ శతాబ్ధపు లుక్ కోసం ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అడుగడుగునా మెప్పిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త చురుకుగా వ్యవహరించి ఉండాల్సింది. ల్యాగింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. రెహమాన్ సంగీతానికి వంక పెట్టాల్సినంత అవసరం లేదు కానీ.. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయన ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉండాల్సింది. పాటలు అర్థం కావు కానీ.. పాటల చిత్రీకరణ మాత్రం బాగుంది. విఎఫ్ఎక్స్ వర్క్ ఈ సినిమాపై అంత పెద్దగా ప్రభావం చూపినట్లుగా అనిపించలేదు. విజువల్గా కొత్తదనమేమీ కనిపించలేదు కానీ సినిమాకి ఏం కావాలో అంతే తీసుకుంటే చాలు అన్నట్లుగా తీసికెళ్లి పోయారు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు.. వారి వారి పనితనాన్ని కనబరిచారు.
విశ్లేషణ:
ఇక డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించి.. ఈ సినిమా కథపై ఎన్నో ఏళ్లుగా కుస్తీ పడుతున్న మణిరత్నం.. అనుకున్న రేంజ్లో అయితే సినిమాని తెరకెక్కించ లేదని అనిపిస్తుంది. అందుకు కారణం.. ఇప్పుడు అప్డేటెట్ ప్రేక్షకులని చెప్పుకోవచ్చు. ‘బాహుబలి’ సినిమా చూసిన తర్వాత.. ఆ సినిమా కంటే గొప్పగా సినిమా తీయాలని, అలా తీస్తేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని దర్శకుడు రాజమౌళి భావించాడు కాబట్టే.. ‘RRR’కి అంత వర్క్ చేశాడు. కానీ ఈ సినిమాకి అంత వర్క్ జరగలేదని అనిపిస్తుంది. బహుశా నటీనటుల విషయంలో వచ్చిన కన్ఫ్యూజన్ కూడా మణిరత్నంని ఆ దిశగా ఆలోచించనీయకుండా చేసి ఉండవచ్చు.
ఈ సినిమా కథని, పాత్రని.. రాజమౌళి తరహాలో ముందే మణిరత్నం చెప్పి ఉంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రస్ట్ వచ్చేది. సినిమా చూసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉండేది. ఆ విషయంలో మణిరత్నం పొర పాటు చేశాడనే చెప్పుకోవాలి. అలాగే, తెలుగు ప్రేక్షకులకు ఏమో గానీ, తమిళ ప్రేక్షకులకు అందరికీ కాకపోయినా.. కొందరికైనా ‘పొన్నియిన్ సెల్వన్’ నవల గురించి తెలిసి ఉండవచ్చు.. అలాగే వారు చదివి ఉండవచ్చు. ఆ కథని తెర రూపమిస్తూ.. ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నప్పుడు సాంకేతికంగా ఉన్నత విలువలు అద్దితేనే.. తెరపై నిండుతనం వస్తుంది.
ఈ మధ్య ఓ ఈవెంట్లో రాజమౌళి ‘బాహుబలి’ చిత్రమే ధైర్యాన్నిచ్చిందని మణిరత్నం చెప్పుకొచ్చాడు. రెండు పార్టుల విషయంపై ఆయన ఈ విధంగా మాట్లాడాడు. మరి ఆయనేలా చిత్రీకరించాడనేది కూడా తెలుసుకుని ఉంటే.. ఈ సినిమా రిజల్ట్ మోత మోగేది. ఎందుకంటే.. ఈ సినిమాలో చూపించే ఒక్కో పాత్రకి ఒక్కో సినిమా తీసే అవకాశం ఉంది. అంతేకాదు, అవేంజర్స్లా ఒక్కో పాత్రతో ఒక్కో సినిమా తీసి.. చివరికి అందరినీ కలిపినట్లయితే.. ఒక ‘పొన్నియిన్ సెల్వన్ యూనివర్స్’ ఏర్పడేది. అంత అవకాశం ఉన్నా కూడా.. మణిరత్నం ఆ దిశగా ఆలోచించలేదు. అలా ఆలోచించి ఉంటే.. ఈ కథలోని పాత్రలు కూడా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేవి కావు. ఈ విషయంలోనూ మణిరత్నం మిస్టేక్ చేశాడనే చెప్పుకోవచ్చు.
‘బాహుబలి’ కంటే కూడా భారీ కథ ఉన్న ఈ సినిమాని చాలా సింపుల్గా తీశాడేంటబ్బా! అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఆ సినిమాలో ఉన్న రాజ్య కాంక్ష, అధికార వాంఛ.. వాటి కోసం కుట్రలు, కుతంత్రాలు, అసూయా ద్వేషాలు.. ఇలా అన్నీ ఈ సినిమాలోనూ ఉన్నాయి. చరిత్రను వక్రీకరించడం ఎందుకని అనుకున్నాడో.. ఏమో తెలియదు కానీ నవలలో ఉన్నట్లుగానే మణిరత్నం తెర రూపమివ్వడానికి ప్రయత్నించాడు. సెకండాఫ్పై ఇంట్రస్ట్ క్రియేట్ చేయడానికి ‘పొన్నియిన్ సెల్వన్’ను ఓ స్త్రీ పాత్ర కాపాడుతున్నట్లుగా చూపించి.. ఆ పాత్ర వివరాలు తెలియాలంటే సెకండాఫ్ చూడాలనేలా మొదటి భాగాన్ని ముగించాడు.
మణిరత్నం మార్క్ చిత్రీకరణకు లోటు లేదు.. కానీ కొత్తదనం కనిపించలేదు. అలాగే వంక పెట్టడానికి కూడా ఏమీ లేదు.. కానీ ఇంకా గొప్పగా ఈ కథని తీయవచ్చనే భావన అయితే కలుగుతుంది. సాంకేతికతను ఇంకాస్త ఉన్నతంగా వాడుకుని ఉంటే.. ఈ ప్రాజెక్ట్ రిజల్ట్ మరో రకంగా ఉండేది. మొత్తంగా చూస్తే మాత్రం.. మణిరత్నం మార్క్తో వచ్చిన ఈ సినిమా.. ‘బాహుబలి’ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. నవల చదివిన వారికి కాస్త ఈ సినిమా అర్థమవుతుందేమో.. కానీ, దాని గురించి తెలియని వారికి, ముఖ్యంగా తెలుగు వారికి కన్ఫూజనే ఎక్కువగా ఉంటుంది.
ట్యాగ్లైన్: మిస్టేక్ చేశావ్.. మణిరత్నం!
రేటింగ్: 2.5/5