రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి మరో ఆరు స్పెషల్ రైళ్లు వచ్చేశాయ్.!
సంక్రాంతి పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయినా రద్దీగా ఉండడంతో తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చింది

Sankranti Special Trains | సంక్రాంతి పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయినా రద్దీగా ఉండడంతో తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని చెప్పింది. తిరుపతి – సికింద్రాబాద్, కాకినాడ – సికింద్రాబాద్, కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ సీటింగ్ తదితర కోచ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
తిరుపతి – సికింద్రాబాద్ (07065) మధ్య ప్రత్యేక రైలును ఈ నెల 10న తిరుపతి నుంచి ఉదయం 05.30 నిమిషాలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 05.15 నిమిషాలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, కర్నూలు, గద్వాల, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడ స్టేషన్లలో ఆగనున్నది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07066) మధ్య స్పెష్టల్ ట్రైన్ ఈ నెల 10న సికింద్రాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7గంటలకు కాకినాడ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07067) మధ్య ప్రత్యేక రైలు జనవరి 11న కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07250) మధ్య 12న స్పెషల్ ట్రైన్ నడువనున్నది. రైలు సాయంత్రం 6.05గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ – తిరుపతి (07249) రైలు 13న నడువనున్నది. ఈ రైలు కాకినాడలో సాయంత్రం 5.10 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది.