♦సీఎం రేవంత్ రెడ్డికి ‘బండి’ బహిరంగ లేఖ
విధాత బ్యూరో, కరీంనగర్: సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సిరిసిల్లలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయని తెలిపారు. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ పెట్టిన విషయాన్ని ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే నేత కార్మికుల దుస్థితికి కారణమని పేర్కొన్నారు.
గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోందని, వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి, స్థానిక శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు పలుమార్లు హామీ ఇచ్చినా చెల్లింపులు నేటి వరకు జరగలేదన్నారు. చివరకు ఎన్నికల కోడ్ను సాకుగా చూపి బకాయిలు చెల్లింపులు నిలిపివేశారని చెప్పారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్న నేపథ్యంలో, ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి సిరిసిల్ల కార్మికులను ఆదుకోవాలని కోరారు.
♦ ‘వర్కర్ టు ఓనర్’ పథకం ఏమైంది?
సిరిసిల్లలో నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు 2017 అక్టోబర్ 11న అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘వర్కర్ టు ఓనర్’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారని, తొలి విడతలో ఈ కార్యక్రమానికి రూ.220 కోట్లను కేటాయిస్తున్నామని, 1104 మంది కార్మికులను మొదటి దశలో ఓనర్లుగా మారుస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ ఇంతవరకు ఈ పథకం అమలుకు నోచుకోలేదన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే ఆ నిధులు కేటాయించి నేత వర్కర్లను ఓనర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరారు.
సిరిసిల్లలో మరమగ్గాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.