బేబి ఇచ్చిన జోష్.. నలుగురు డైరెక్టర్స్‌ని లైన్‌లో పెట్టేసిన ఎస్‌కేఎన్

  • By: sn    latest    Oct 13, 2023 8:50 AM IST
బేబి ఇచ్చిన జోష్.. నలుగురు డైరెక్టర్స్‌ని లైన్‌లో పెట్టేసిన ఎస్‌కేఎన్

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబి’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన ఈ సినిమాపై చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఓటిటిలోను బుల్లితెరపై మాసివ్ రెస్పాన్స్ ద‌క్కించుకున్న ఈ సినిమా ప‌లు అవార్డ్‌లు కూడా ద‌క్కించుకుంది. బేబి సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఈ జోడి క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నారు. ఆనంద్‌ దేవరకొండ , వైష్ణవి చైతన్య మరోసారి ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

బేబీ సినిమా సక్సెస్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ కి ఫుల్ జోష్ అందించ‌డంతో ఆయ‌న వ‌రుస సినిమాల‌ని లైన్‌లో పెట్టారు. యువ ద‌ర్శ‌కుల‌కి అవ‌కాశం ఇస్తూ కొత్త క‌థ‌ల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడు. తాజాగా ఎస్కేఎన్ త‌న న‌లుగురు డైరెక్ట‌ర్స్ ఎవ‌రో తెలియ‌జేశాడు. నాలుగు సినిమాల డైరెక్టర్స్ తో కలిసి ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎస్కేఎన్ త్వ‌ర‌లో వారితో కొత్త సినిమాలు చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశాడు. ఫొటోలో కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, మరో ఇద్దరు కొత్తవాళ్లు సుమన్ పాతూరి, రవి నంబూరి ఉన్నారు. వీరి న‌లుగురితో త‌దుప‌రి సినిమాలు నిర్మించ‌బోతున్నారు. ఒకేసారి ఇలా నాలుగు సినిమాల ద‌ర్శ‌కుల‌ని అనౌన్స్ చేయ‌డంతో అందరు షాక్‌లో ఉన్నారు.

ఎస్కేఎన్ విష‌యానికి వ‌స్తే మెగా అభిమానిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌స్తున్నారు. బేబి సినిమా హిట్ కావ‌డంతో ఎస్కేఎన్ పేరు మారు మ్రోగిపోయింది. ఆయ‌న స్పీచ్‌ల‌తో కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయ‌న నాలుగు సినిమాల‌ని ఒకేసారి అనౌన్స్ చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.