ఒకే ట‌ర్మ్‌లో మూడుసార్లు సీఎంగా ప్ర‌మాణం చేసిన రికార్డు నితీష్‌ది- తేజ‌స్వి యాద‌వ్‌

బీహార్ సీఎం నితీష్‌పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా విరుచ‌క‌ప‌డ్డారు. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, నితీష్‌ నిబద్ధతను నిలదీశారు

  • Publish Date - February 12, 2024 / 11:28 AM IST

పాట్నా: బీహార్ సీఎం నితీష్‌పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా విరుచ‌క‌ప‌డ్డారు. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, నితీష్‌ నిబద్ధతను నిలదీశారు. ‘ఇండియా’ (I.N.D.I.A.) బ్లాక్ నుంచి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడం ద్వారా తొమ్మిదోసారి సీఎంగా నితీష్ కుమార్‌ ప్రమాణస్వీకారం చేయడాన్ని ప్రశ్నించారు. ఒకే టర్మ్‌లో మూడు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రికార్డు ఆయనకే దక్కుతుందంటూ విమ‌ర్శించారు. మరోసారి నితీష్‌ పార్టీ మారరనే గ్యారెంటీ ప్రధానమంత్రి మోదీ ఇస్తారా? అని ప్రశ్నించారు.


”జేడీయూ ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తారు? ఇంతకుముందు మీరు (జేడీయూ) బీజేపీని విమర్శించారు. ఇప్పుడు పొగుడుతున్నారు. దీనికి ఏమి చెబుతారు? ఆర్జేడీ ప్రజల ముందుకు వెళ్తుంది. తాము ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఘనంగా చెప్పుకుంటుంది” అని తేజస్వి అన్నారు.

సోషలిస్టు నేతగా చెప్పుకునే నితీష్ కుమార్ విపక్ష కూటమికి ఉద్వాసన చెప్పి బీజేపీతో చేతులు కలపడంపై ప్రజలకు ఏమి చెబుతారని తేజస్వి ప్రశ్నించారు. బీజేపీని ఆయన మేనల్లుడే (తేజస్వి) బిహార్‌లో అడ్డుకుంటాడని సవాలు విసిరారు. ”మిమ్మల్ని (నితీష్) మా కుటుంబ సభ్యుడిగా మేము భావిస్తాం. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునేందుకు మీరు జెండా పట్టారు. ఇప్పుడు మీ మేనల్లుడు ఆ జెండా భుజాన వేసుకుంటాడు. బీహార్‌లో మోదీని అడ్డుకుంటాడు” అని తేజస్వి స్పష్టం చేశారు.

Latest News