Krishna board | కృష్ణా బోర్డు ఆపరేషన్‌కు తెలుగు రాష్ట్రాల ఓకే

కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషన్‌ను కష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్వహించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి

Reported by: Somu | latest | Feb 01, 2024, 3:28 am IST
Read Time: 2 mins
Krishna board | కృష్ణా బోర్డు ఆపరేషన్‌కు తెలుగు రాష్ట్రాల ఓకే

Krishna board | విధాత : కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషన్‌ను కష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్వహించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. గురువారం జలసౌధ వేదికగా జరిగిన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నీటీ పంపకాల కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని, నీటి వాటాల కేటాయింపులో త్రిసభ్య కమిటీదే నిర్ణయమని సమావేశంలో అంగీకారానికి వచ్చారు. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాల్లో 50 శాతం వాటా డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.


నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించామని తెలిపారు. తెలంగాణలో ఆరు, ఏపీలో తొమ్మిది కంపోనెట్స్ అప్పగింతకు నిర్ణయం జరిగిందన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే చర్చించడానికి దిల్లీ వేదిక ఉందన్నారు. నీటి నిర్వహణను, అవుట్ లెట్స్‌ బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదించాయన్నారు. జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై చర్చ జరగలేదని, నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామన్నారు.