MLA Raghunandan Rao | ప్రభుత్వమే కథ అల్లి.. పోలీసులతో చెప్పించింది: MLA రఘునందన్రావు
విధాత: ప్రశ్నపత్రం లీకేజీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి రాజకీయ రంగు పూయడం సరైంది కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపకుండా అధికారపార్టీకి పావులుగా మారొద్దని సూచించారు. 11.20 గంటలకు బండి సంజయ్ ఫోన్కు ప్రశ్నపత్రం వస్తే రాజకీయ కక్షతో కేసు పెట్టారని రఘునందన్రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 9.37 నిమిషాలకు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసింది ఎవరు? ఫొటో తీసిన వ్యక్తికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉన్నదా? అని […]

విధాత: ప్రశ్నపత్రం లీకేజీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి రాజకీయ రంగు పూయడం సరైంది కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపకుండా అధికారపార్టీకి పావులుగా మారొద్దని సూచించారు. 11.20 గంటలకు బండి సంజయ్ ఫోన్కు ప్రశ్నపత్రం వస్తే రాజకీయ కక్షతో కేసు పెట్టారని రఘునందన్రావు ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 9.37 నిమిషాలకు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసింది ఎవరు? ఫొటో తీసిన వ్యక్తికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉన్నదా? అని సీపీ రంగనాథ్ను ప్రశ్నించారు. ఆ ఫొటో ప్రశాంత్ తీశాడా?ఆ ఫొటో బీజేపీ నేతలు తీశారా? ఆ ఫొటో తీసిన శివగణేశ్ ఎవరు? ఆయన గోడ దూకి వెళ్లి హిందీ పేపర్ ఫొటో తీసినట్లు చెబుతున్నారు. గోడ దూకి వెళ్లి ఫొటో తీస్తుంటే పోలీస్ నిఘా ఎక్కడ ఉన్నదని రఘునందన్ ప్రశ్నించారు.
పరీక్ష కేంద్రం వద్ద ఒక్క పోలీస్ కూడా లేడా? శివగణేశ్ 9. 37 గంటలకు ఒక విద్యార్థి దగ్గరి నుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటోతీశాడు. ఇది జరిగితే.. ప్రశాంత్ నుంచి 11.20 గంటల తర్వాత బండి సంజయ్కి వచ్చిందని చెబుతున్నారు.
ఉదయం 9.37 నుంచి 11. 21 గంటల మధ్యలో సుమారు 1. 55 నిమిషాల మధ్యలో శివగణేశ్ మొబైల్ నుంచి ఈ ఫొటోలు ఎంతమందికి పోయాయి? అందులో మీడియా మిత్రులు ఉండరా? ఏ పేపర్లు? ఏ ఛానళ్లు ఉన్నాయన్నది మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? శివగణేశ్ వాట్సప్ను పోలీసులు బైట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
శివగణేశ్ ఫోన్ను మీరు సీజ్ చేశారా?దానిని 24 గంటల్లో కోర్టులో డిపాజిట్ చేయాలి? ఆ పని మీరు చేశారా? దాని ద్వారా వచ్చిన వాట్సప్ సమాచారాన్ని ఆయన ఎవరెవరికి పంపించాడన్నది మీ రిమాండ్ రిపోర్టులో గాని, జడ్జి ముందుగా ఉంచారా? అని ప్రశ్నించాడు.
ఇవన్నీ పక్కనపెట్టి 9.37 గంటలకు నేరం జరిగిందని మీరే చెబుతూ.. 11.20 గంటలకు అంటే రెండు గంటల తర్వాత పరీక్ష హాల్ నుంచి 50 శాతం మంది విద్యార్థులు బైటికి వస్తారు. అప్పుడు లీక్ ఎలా అవుతుందని రఘునందన్రావు ప్రశ్నించారు. ఘటనలో పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. హిందీపేపర్ బయటకు వస్తే ప్రెస్మీట్లో సీపీ రంగనాథ్ తేలిగ్గా మాట్లాడారు. 24 గంటల తర్వాత రాజద్రోహం, కుట్ర జరిగిందని మాట్లాడారు.
ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించినట్లు మేము భావిస్తున్నామన్నారు. జరిగిన అన్యాయాన్నికోర్టు దృష్టికి తీసుకెళ్తాం. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు అందరినీ సమదృష్టితో చూడాలన్నారు. ఒక పార్టీకి ఒక న్యాయం మరొక పార్టీకి మరో న్యాయం అన్న విధంగా మీ ప్రవర్తన ఉండకూడదని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.