CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీని అడ్డుకున్న వారిని నిలదీయాలి: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోని ఏడాదిన్నరలో 59వేల ఉద్యోగాల భర్తీ ఘనత మాదే
పదేళ్లుగా బీఆర్ఎస్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది
అన్ని వర్గాలకు నాణ్యమై విద్య కోసమే యంగ్ ఇండియా స్కూల్స్
సీఎం రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనతా భావాన్ని వీడాలని.. ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్రామ్ భవన్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు అవార్డుల బహూకరణ, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్ఢి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు.
విద్యార్థుల చిత్రకళా గ్యాలరీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారని..కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు? అని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా? అని..కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత దేశంలోనే మా ప్రభుత్వానిదేనన్నారు. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామని..కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నాయని విమర్శించారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోందన్నారు. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెల్లు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని విమర్శించారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండని సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నదని సంపూర్ణంగా విశ్వసించే వాడిని. కష్టపడి చదివితే రాణిస్తారు. మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నా. మీకెప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్నారు.
విద్యార్థులు తెలంగాణ పునర్ నిర్మాణ భాగస్వాములు కావాలి
జీవితంలో తొలి మెట్టు ఎక్కబోతున్న విద్యార్థినీ విద్యార్థులంతా కష్టపడి చదువుకుని భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. చదువుకోవడం ద్వారా కుటుంబానికే కాకుండా, సొంత ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవొచ్చని ఉద్భోదించారు. “అసమానతలు తొలగించి సమసమాజం నిర్మించాలన్న ఆనాటి పోరాటయోధుల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గురుకులాల్లో చదువుకుంటున్న మా పిల్లలు రేపటి రోజున ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కాంక్షిస్తున్నామని తెలిపారు.
సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం తపన
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డిపేరును తెలుగు యూనివర్సిటీకి, మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును.. ఇలా ఎందరో త్యాగమూర్తుల స్ఫూర్తితోనే సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని… ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువు చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు. చదువులో మరో మెట్టు ఎక్కబోతున్న విద్యార్థుల ముందు రకరకాల రంగుల ప్రపంచం ఆకర్షణీయంగా ఉంటుందని.. ఊహాగానాల్లో తిరగకుండా జీవితంలో 25 సంవత్సరాలు వచ్చే వరకు కష్టపడి చదువుకుంటే ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి, భవిష్యత్తులో రాణించడానికి వీలవుతుందన్నారు. దారితప్పితే తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. చదువుకుంటే గ్రామం నుంచి రాష్ట్రం వరకు గర్వంగా బతికేలా చేస్తుందన్నారు.
వందేళ్ల చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలిసారి దళితుడిని వీసీగా నియమించాం. ఆ కోవలోనే సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీకి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా, విద్యా కమిషన్ చైర్మన్గా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా, రాష్ట్ర శాసనసభ స్పీకర్గా గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత బిడ్డలు ఈ పదవులు చేపట్టారంటే వారికి కేవలం కులంతోనే అవకాశాలు రాలేదు. వారు ఉన్నత స్థాయిలో చదువుకుంటే వచ్చాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారులు వేంరెడ్డి నరేందర్ రెడ్డివ, మహ్మద్ అలి షబ్బీర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.