Revanth Reddy బీఆరెస్ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలంతా ఆక్రమణదారులే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మహబూబ్నగర్ బీఆరెస్ నాయకులు విధాత, హైద్రాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో CM KCR పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీలతో పాటు జిల్లా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం రేవంత్ సమక్షంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, మాజీ […]
Revanth Reddy
విధాత, హైద్రాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో CM KCR పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానన్న హామీలతో పాటు జిల్లా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం రేవంత్ సమక్షంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరెందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవి, పలువురు బీఆరెస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతు ఉద్యమ సమయంలో కేసీఆర్ ను ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మి జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారని, రెండుసార్లు సీఎం అయినా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలమూరుకు చేసిందేంలేదని విమర్శించారు.
కేసీఆర్ కు మాత్రం వేయి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందని, కొడుకు కేటీఆర్ కు వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందన్నారు. వారి కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, టీవీ చానెల్స్, పేపర్లు వచ్చాయని, పాలమూరు జిల్లా మాత్రం కేసీఆర్ చేతిలో మోసపోయి గోస పడుతునే ఉందన్నారు. జిల్లామంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వక్ఫ్ ల్యాండ్ సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీఆరెస్ పాలనలో అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు. ల్యాండ్ , శాండ్, మైన్, వైన్ ఏ దందా లో చూసినా బీఆరెస్ ఎమ్మెల్యేలు, నేతలే ఉన్నారని, వాళ్ల అరాచకాలను ఎదిరించేందుకు ఇవాళ పాలమూరు నేతలు కాంగ్రెస్ లో చేరడం అభినందనీయమన్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటానని, పోలీసులు, అధికారులు బీఆరెస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని, అక్రమ కేసులు పెడితే మిత్తితో చెల్లిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించండని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుందామన్నారు. ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.