TSPSC ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రంగంలోకి ED! శంకరలక్ష్మి, సత్యనారాయణలకు నోటీసులు

ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు ప్రశ్నపత్రాల కేసులో భారీగా నగదు చేతులు మారినట్టు ఈడీ అనుమానం విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ(question paper leakage) కేసు(Case)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్ణయించింది. వీరిద్దరి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ.. ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది. […]

TSPSC ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రంగంలోకి ED! శంకరలక్ష్మి, సత్యనారాయణలకు నోటీసులు
  • ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు
  • ప్రశ్నపత్రాల కేసులో భారీగా నగదు చేతులు మారినట్టు ఈడీ అనుమానం

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ(question paper leakage) కేసు(Case)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్ణయించింది.

వీరిద్దరి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ.. ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రశ్న పత్రాల కేసులో భారీగా నగదు చేతులు మారినట్టు ఈడీ అనుమానిస్తున్నది. మనీలాండరింగ్‌ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న శంకరలక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కార్యాలయం ఇన్‌ఛార్జి శంకర్‌లక్ష్మి కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రం లీకైంది. శంకరలక్ష్మితో పాటు సర్వీస్ కమిషన్‌కు చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు, ఎల్లుండి విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నది.

నేడు హైకోర్టుకు సిట్‌ నివేదిక

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నివేదికను ఇవాళ హైకోర్టుకు సమర్పించనున్నది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపించాలంటూ.. ఎన్‌ఎస్‌యూఐ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా.. నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సిట్‌ అధికారులు నివేదిక రూపొందించారు.

ఈ కేసులో ఇప్పటికే 17మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 15 మందిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్పీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, షమీమ్‌, రమేశ్‌లకు చెందిన సెల్‌ ఫోన్లతో పాటు కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ లాబోరేటరి (సీఎస్‌ఎఫ్‌ఎల్‌)కీ పంపారు.

సీఎస్‌ఎఫ్‌ఎల్‌ నుంచి ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందగా.. ప్రశ్నపత్రం ఎలా లీకైంది? ఎవరెవరెకి చేరవేశారు అనే విషయాలతో పాటు ఎంత నగదు చేతులు మారిందనే అంశాలను సిట్‌ అధికారులు నివేదికలో పొందుపరిచారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే క్రమంలో బైటపడిన విషయాలు దాని ఆధారంగా దర్యాప్తు ఏ విధంగా నిర్వహించాలనే విషయాలను సిట్‌ అధికారులు నివేదించనున్నారు.