విధాత : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి అమ్మవారికి గజవాహన సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారాన్ని అమ్మవారికి ధరింపచేసి గజవాహనంపై ఊరేగించారు. లక్ష్మీకాసుల హారంతో దేదీప్యమానం శోభతో గజవాహనంపై విహరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల భారీగా తిరుచానూరు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.