Site icon vidhaatha

Tungaturthi | ఎమ్మెల్యే కిషోర్ మాదిగలకు క్షమాపణ చెప్పాలి: మందకృష్ణ డిమాండ్

Tungaturthi

విధాత: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఏమ్మార్పిఎస్ నాయకుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత బంధు అవినీతిపై ఎమ్మార్పీఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల మేరకు ఈ నియోజకవర్గంలో కూడా నిరసనలు నిర్వహించారన్నారు.

అంత మాత్రాన ఎమ్మార్పీఎస్ నాయకులను, కార్యకర్తలను అవమానించేలా ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, విభేదాలు ఉండడం సహజమన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు.

ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఏమ్మర్పిఎస్ నాయకుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. కిషోర్ ఇకనైనా తన అహంభావాన్ని తగ్గించుకోవాలన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో క్రిమినల్, ఫ్యాక్షన్ తరహా రాజకీయ సంస్కృతి సాగుతుండటం విచారకరమన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేసే సంస్కృతి అరాచకానికి దారితీస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారన్నారు. మాదిగలు రాజకీయ చైతన్యంతో వ్యవహరించి ఎన్నికల్లో మాదిగలను అవమానించే వారికీ గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ టిడిపి, వైఎస్ఆర్ టిపి, బిఎస్పి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version