Tushar Gandhi | జీవితంలో మొట్టమొదటి సారి.. తుషార్‌ గాంధీ అరెస్ట్‌

<p>Tushar Gandhi తుషార్‌ గాంధీని అరెస్ట్‌ చేసిన పోలీసులు ‘క్విట్‌ ఇండియా’ అమరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళుతుండగా అరెస్ట్‌ రాత్రి నుంచే ఇంటి వద్ద మోహరించిన పోలీసులు ముంబై: మహాత్మాగాంధీని బ్రిటిష్‌ పోలీసులు 81 సంవత్సరాల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టార్గెట్‌ చేయగా.. ఇప్పుడు ఆయన ముని మనుమడు తుషార్‌ గాంధీని ముంబై పోలీసులు టార్గెట్‌ చేశారు. బుధవారం ఉదయం దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌లో క్విట్‌ ఇండియా అమరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు […]</p>

Tushar Gandhi

ముంబై: మహాత్మాగాంధీని బ్రిటిష్‌ పోలీసులు 81 సంవత్సరాల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టార్గెట్‌ చేయగా.. ఇప్పుడు ఆయన ముని మనుమడు తుషార్‌ గాంధీని ముంబై పోలీసులు టార్గెట్‌ చేశారు. బుధవారం ఉదయం దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌లో క్విట్‌ ఇండియా అమరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళుతున్న తుషార్‌ గాంధీని శాంతాక్రజ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

శాంతి భద్రతల పేరుతో తనను పోలీసులు అరెస్టు చేశారని తుషార్‌ గాంధీ ఒక మీడియా సంస్థకు చెప్పారు. తుషార్‌ గాంధీని పోలీసులు అరెస్టు చేయడం ఆయన జీవితంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆయన నివాసం వద్ద మంగళవారం రాత్రి నుంచే పోలీసులు భారీగా మోహరించారు.

ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకుని శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ‘మహాత్మాగాంధీ, కస్తూర్బా ఇదే చారిత్రక రోజున అరెస్టయ్యారు. వారిలాగే అదే రోజున నేను అరెస్టు కావడం సంతోషంగా, గర్వంగా ఉన్నది’ అని తుషార్‌గాంధీ పేర్కొన్నారు.

ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌కు వెళ్లేందుకు సిద్ధపడిన ఇతర గాంధేయవాదులు, సంస్థల ప్రతినిధులకు ఇచ్చినట్టుగా తనకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. తనపై ఎలాంటి అభియోగాలూ నమోదు చేయలేదని పేర్కొన్నారు. తనను గౌరవంగానే చూస్తున్నారని తెలిపారు. పోలీసులు ఎప్పుడు తనను వదిలిపెట్టినా వెంటనే ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌లో అమరవీరులకు నివాళులర్పిస్తానని చెప్పారు.