Site icon vidhaatha

Yadadri Bhuvanagiri | ధాన్యం దగ్ధం చేసి అన్నదాతల నిరసన

Yadadri Bhuvanagiri

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో రైతులు ధాన్యం కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నారాయణపూర్ సెంటర్లో ధాన్యం బస్తాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సర్వేల్, పుట్టపాక, లచ్చమ్మ గూడెం, గంగ మూల తండా, గుజ్జా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల నుంచి రైతులు ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులపాటు ధాన్యం కొనుగోలుకు పడిగాపులు పడి నానా ఇబ్బందులు పడ్డామన్నారు. తీరా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించాక రంగు మారింది అంటూ కోతలు పెట్టి అన్యాయం చేస్తున్నారన్నారు. సకాలంలో కాంటాలు వేయక, కాంటాలు వేసిన ధాన్యం బస్తాల ఎగుమతి కోసం లారీలు రాక నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాకాలం మొదలైనా ఇంకా ధాన్యం కొనుగోలు సాగుతూనే ఉన్నాయని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 20 రోజులుగా డబ్బులు సైతం చెల్లించడం లేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలులో తమ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version