విధాత: ఎమ్మెల్సీల్లో సగానికి పైగా సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పుకుని పొలిటికల్ మైలేజీ పొందాలని చూసిన వైఎస్సార్సీపీ గవర్నమెంట్ ఆశలకు విజయవాడ టీడీపీ ఆఫీసు దగ్ధం సంఘటన గండి కొట్టిందా.. జనమంతా ఆ ఎమ్మెల్సీల గురించి ఆలోచించడం మానేసి అయ్యో రామ పాపం టీడీపీ ఆఫీసును తగలెట్టేసారని అనుకుంటున్నారా.. ప్రజల ఎటెన్షన్ మొత్తం అటువైపు మళ్ళిపోయిందా అని వైసీపీ పెద్దలు బాధపడిపోతున్నారట.
ప్రచార ప్రణాళిక సిద్ధం..
బీసీలు, ఎస్సీలకు భారీగా పోస్టులు ఇస్తున్నట్లు చెప్పి మైలేజ్ రాబట్టాలని ప్లాన్ చేసుకున్నారు. రెండు రోజుల నుంచి జాబితా విడుదలపై బ్రేకింగ్స్ ఇస్తూ, ప్రచార ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయమే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎమ్మెల్సీలుగా చంద్రబాబు 37 శాతం అవకాశం ఇస్తే.. వైసీపీ 68 శాతం అవకాశం ఇచ్చామని ప్రకటించారు.
ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉన్నదా…
ఎమ్మెల్సీలకు ఇచ్చిన సామాజికవర్గాల మద్దతు కూడగట్టుకునే విధంగా ప్రచారం కోసం భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయా సంఘాల సంబరాలు, సన్మానాలు ప్లాన్ చేసుకున్నారు. ఇంతలోనే గన్నవరంలో టిడిపి కార్యాలయంపై కొందరు దాడి చేశారు. వాహనాలు తగలబెట్టారు.
రాష్ట్ర ప్రజలంతా ఎమ్మెల్సీల ఎంపికలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుంటారని ఆశించిన సీఎం జగన్కు కాస్త చికాకు కలిగింది అంటున్నారు. అందరి దృష్టి పూర్తిగా గన్నవరం ఘటనపైకి మళ్లడంతో తమ ఎమ్మెల్సీ ప్రచారం మరుగునపడిందని పార్టీ పెద్దలు ఫీలయ్యారట.
ప్రతిపక్ష టీడీపీ మీద దాడి అంటే అది అక్కడి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాత్ర ఉండే ఉంటుందని అంటున్నారు. ఈ విషయం మీద వంశీకి పార్టీ పెద్దల నుంచి క్లాస్ పడే అవకాశం ఉందని అంటున్నారు.