Site icon vidhaatha

CM Revanth Reddy: మీకు.. మాకు పోలిక లేదు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిలో.. ఉద్యోగాల కల్పన..పెట్టబడుల సమీకరణ.. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో దేనిలోనూ మీకు మాకు పోలిక లేదని.. పట్టింపులేకుండా వ్యవహరించిన విధానం మీది.. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాదని సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో బిల్డ్ నౌ పోర్టల్ ను అవిష్కరించి దరఖాస్తుదారు లకు అనుమతి పత్రాలు అందజేశారు. అలాగే 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మిస్ యూనివర్స్ పోటీలపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శించబోతున్నారన్నారు. 72 వ మిస్ యూనివర్స్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతుందని..భవిష్యత్ లో వందల కోట్ల ఆదాయం రాబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్ములా ఈ రేస్ ముసుగులో మీరు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని..మీకు మాకు పోలికా? అని ఎద్దేవా చేశారు.

మేం పది నెలల్లో చేస్తే.. మీరు పదేళ్లలో ఎందుకు చేయలేదు?

గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్లుగా కారుణ్య నియామకాలను సైతం పట్టించుకోలేదంటే..ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండన్నారు. అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని నిరుద్యోగ యువత పోరాడిందని..రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ కోసం అమరులైనవారి ఆశయాలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మేం అధికారంలో రాగానే 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వంలో భర్తీ చేశామని తెలిపారు. కానీ తామే నోటిఫికేషన్లు వేశామని, మేం చేసింది ఏం లేదని కొందరు బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పది నెలల్లో మేం చేసిన పని… పదేళ్లలో మీరెందుకు చేయలేకపోయారని నిలదీశారు.

పదేళ్లు పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా? అని..మీ ఇంటి బిడ్డలకు పదవి పోతే ఇంకో పదవి ఇచ్చుకున్న మీకు.. తెలంగాణలో ఈ పేదింటి బిడ్డల బాధ కనిపించలేదా? అని ప్రశ్నించారు. కేవలం పది నెలల్లో 57, 924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. గ్రూప్ 1, 2, 3 లలో 2వేల పైచిలుకు ఉద్యోగాలకు మరి కొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. తాము చేయలేదు కాబట్టి మమ్మల్ని చేయనీయకూడదనే ధోరణిలో బీఆరెస్ తీరు ఉందని మండిపడ్డారు. అందుకే మా కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆనాడు ఒక వ్యక్తి, ఒక పార్టీ సెంట్రిక్ గా నిర్ణయాలు జరిగితే.. ఇవాళ ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు జరుగుతున్నాయన్నారు. మేము ఇచ్చే జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కువ అయి తట్టుకోలేక ఆపేయాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని.. దేశంలో మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం వచ్చాక జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వొద్దు ఆపండని ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

అనుమతులు ఆన్ లైన్ లోనే
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే బిల్డ్ నౌ పోర్టల్ ను తీసుకొచ్చామన్నారు. ఎంతటివారైనా సరే ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే మా ఉద్దేశం.. అదే గుడ్ గవర్నెన్స్.. ఇది తెలంగాణ మోడల్ అని చెప్పుకొచ్చారు. ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారని..నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా? లేక అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా?..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకా? పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఎందుకు మాపై కోపంగా ఉంటారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మరికొందరు రేవంత్ రెడ్డికి పాలనలో పట్టు రాలేదని మాట్లాడుతున్నారని.. రాజయ్య, ఈటెల లాంటి బలహీనవర్గాలను సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టా అని చురకలేశారు. మేం గడీలలో పెరగకపోవచ్చు…కానీ నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగామని..అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు మానవత్వం లేదన్నారు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి..మేం విజ్ఞతను ప్రదర్శిస్తున్నామని..ఆ విజ్ఞత లేకపోవడం వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Exit mobile version