ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందే

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్ నాథ్‌ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ బలపడకుండా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని భద్రతా బలగాలకు సూచించారు

  • Publish Date - June 16, 2024 / 07:54 PM IST

ప్రత్యేక ఆపరేషన్‌కు సిద్ధంకండి
భద్రతా బలగాలకు హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ధేశం
అమర్‌నాథ్ యాత్రకు భారీ బందోబహ్తు

విధాత : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్ నాథ్‌ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ బలపడకుండా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని భద్రతా బలగాలకు సూచించారు. కేంద్ర మంత్రి షా అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపధ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా అమిత్ షా సమీక్ష చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాల మోహరింపు, చొరబాటు యత్నాలు తిప్పికొట్టడం. ఉగ్రవాద నిర్మూలనా కార్యకలాపాలపై షా అధికారులతో చర్చించారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత శాంతిభద్రతల గురించి అమిత్ షా సమాచారం తీసుకున్నారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైవేలు, సున్నిత సంస్థలు, సున్నిత ప్రాంతాలను 24 గంటలూ పర్యవేక్షించాలని ఆయన కోరారు. విదేశీ ఉగ్రవాదులు కేంద్రపాలిత ప్రాంతంలోకి ప్రవేశించే అన్ని చొరబాట్లను మూసివేయాలని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ ప్రక్రియకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినందుకు భద్రతా బలగాలను అభినందించారు. ఉగ్రవాదాన్ని, దాని మద్దతుదారులను అణిచివేసేందుకు కేంద్రపాలిత ప్రాంత పరిపాలనకు అన్ని రకాల వనరులను అందజేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

పెరిగిన ఉగ్ర కార్యకలాపాలు
జమ్మూ కాశ్మీర్ లోని రియాసి, కథువా, దోడా జిల్లాల్లో గత నాలుగు రోజుల్లో ఉగ్రవాదులు నాలుగు చోట్ల దాడి చేసి తొమ్మిది మంది యాత్రికులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌ను చంపారు. ఏడుగురు భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడ్డారు. కతువా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా మరణించారు. వారి నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని పాకిస్థాన్‌కు చెందిన అష్కరే తొయిబాకు ముసుగు సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎస్) ప్రకటించుకుంది. భవిష్యత్తులో మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రకు ముందు ఈ సంఘటన జరిగింది. ఈ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. యాత్రికులు జమ్మూ కాశ్మీర్లోని బల్తాల్, పహల్గామ్ లోని రెండు మార్గాల ద్వారా అమరనాథ్‌కు చేరుకుంటారు. జమ్మూలోని వరుస ఉగ్రవాద ఘటనలపై పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ.. హోం మంత్రి అమిత్ షా. ఎన్ఎస్ఏ ఆజిత్ డోబాల్, జమ్మూ-కశ్మీర్ ఎల్‌జీ మనోజ్ సిన్హాలతో ఇటీవల సమీక్ష జరిపారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం నిర్మూలనకు పూర్తిస్థాయిలో శక్తిసామర్ధ్యాలను వినియోగించాలని ప్రధాని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఉగ్రవాద ఏరివేత చర్యలను ముమ్మరం చేయనున్నారు. కాగా అమిత్ షా అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆజిత్ దోవల్ , జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News