ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా పుల్రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన బోలే బాబా ఇంకా పరారీలో ఉన్నాడు
జైలుకెళ్లి.. బాబాగా మారి
18 ఏండ్లపాటు పోలీసు శాఖలో ఉద్యోగం
విలాసవంతమైన ఆశ్రమం..వింతైన ఆహార్యం
విధాత : ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా పుల్రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన బోలే బాబా ఇంకా పరారీలో ఉన్నాడు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిర్వాహకులు సహా అరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్పై పోలీసులు లక్ష రివార్డు ప్రకటించారు. అంతకుముందు పోలీసులు దర్యాప్తు లో భాగంగా భోలేబాబా నివాసం మెయిన్పురి జిల్లాలోని రామ్కుటీర్ చారిటబుల్ ట్రస్టుకు వెళ్లాగ అతను అక్కడ కూడా లేడు. అతను రాజస్థాన్ పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటూ అమాయక జనం ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ‘భోలే బాబా’ బాగోతానికి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
జగద్గురు సాకార్ విశ్వహరి భోలే బాబాగా ప్రాచూర్యం పొందిన ఇతడి అసలు పేరు సూరజ్ పాల్. నారాయణ్ సాకార్ హరి, సాకార్ విశ్వ హరి పేర్లతోనూ చలామణి అయ్యేవాడని, అతనికి నేర చరిత్ర ఉందని యూపీ పోలీసులు వెల్లడించారు. యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సంపన్న దళిత కుటుంబంలో జన్మించిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏండ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. ఉద్యోగ సమయంలో లైంగిక వేధింపుల కేసుల్లో భోలే బాబా నిందితుడని, యూపీ, రాజస్ధాన్లలో పలు కేసులు ఉన్నాయి.
భోలే బాబాపై ఆగ్రా, ఎతావాహ్, కస్గంజ్, ఫరూఖాబాద్, దూసా ప్రాంతాల్లో ఐదు లైంగిక దాడి కేసులు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపుల కేసులో 1997లో అరెస్టయి కొన్నాళ్లు జైలులో ఉన్న అతను బయటకు వచ్చాకా సాకార్ విశ్వ హరిబాబాగా మార్చుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాతా1999లో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి బాబా అవతారం ఎత్తాడని, తన స్వగ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రమం నడిపి తన భార్యతో కలిసి సత్సంగాలు నిర్వహించగా, భక్తుల సంఖ్య పెరిగిపోగా మెయిన్పురికి మకాం మార్చాడని పోలీసులు తెలిపారు. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునే భోలే బాబా.. కాషాయానికి బదులుగా తెల్లటి సూటు, బూట్లు, నల్ల కండ్లద్దాలు ధరిస్తూ ప్రత్యేక ఆహార్యంతో కనిపిస్తుంటాడు.
మూఢ నమ్మకాలతో మోసం
తనను నమ్మే వారిని భోలే బాబా అనేక మూఢ నమ్మకాలతో ముంచేశాడని తెలుస్తున్నది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. ఇవి నమ్మి ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చే వారు. భోలే బాబా గదిలోకి అందమైన అమ్మాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఆశ్రమం నిండా అమ్మాయిలే ఉంటారని స్థానికుల కథనం. అతనికి సంతానం లేకపోగా గతంలో క్యాన్సర్తో బాధపడుతున్న తన మేనకోడలును అతను దత్తత తీసుకున్నాడు.
చనిపోయిన అమ్మాయిని బతికిస్తానంంటూ ఆగ్రాలో చేసిన ప్రకటనల నేపథ్యంలో బోలే బాబాను పోలీసులు 23ఏళ్ల కింద అరెస్టు చేశారు. అయితే హత్రాస్ తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేదని, ఘటనకు ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయాయని, ఈ విషాధం వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉండవచ్చని బోలేబాబా ఆరోపించారు. మరణించిన వారికి సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లుగా భోలేబాబా చెప్పారు. అయితే ప్రమాద సమయంలో భోలే బాబా అక్కడే ఉన్నాడని, అతని భద్రతా సిబ్బంది భక్తులను తోసివేయడంతోనే తొక్కిసలాట మొదలైందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.