West Bengal | రాజకీయం.. ఈ పేరు వింటేనే కొందరిలో రోమాలు నిక్కపొడుస్తాయి. ఎందుకంటే.. రాజకీయాల్లో అంత పవర్ ఉంటుంది. అధికారంలోకి తమ నాయకుడే, తమ పార్టీనే రావాలని కోరుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు తమ పార్టీ అధికారంలోకి రావాలని రకరకాల ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కొందరైతే ప్రత్యర్థి ఓడిపోతే గుండు గీయించుకుంటానని ప్రతినబూనుతుంటారు. కరుడుగట్టిన ఓ కాషాయ వాది కూడా ఇలానే ప్రతినబూని.. చివరకు తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలవడంతో గుండు గీయించుకున్నాడు.
పశ్చిమ బెంగాల్ కుచ్ బెహార్ పరిధిలోని బమన్ పారా గ్రామానికి చెందిన బనేశ్వర్ బర్మన్.. భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని 2011 నుంచి నిరంతరం కల కంటూనే ఉన్నాడు. ఇక ఆ రోజే ప్రతినబూనాడు. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు తాను క్షౌరశాలకు వెళ్లనని, టీఎంసీ ఓడిన రోజు గుండు గీయించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు.
మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో.. బనేశ్వర్ బర్మన్ హృదయం ఉప్పొంగిపోయింది. తాను కన్న కల నెరవేరడంతో.. గురువారం ఉదయం గుండు గీయించుకున్నాడు. ఈ కార్యక్రమం ఓ పండుగలా కొనసాగింది. బర్మన్ ఇరుగుపొరుగు వారికి అన్నదానం చేశాడు.
ఈ సందర్భంగా బర్మన్ మాట్లాడుతూ.. టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షౌరశాలకు వెళ్లలేదు. గత 15 ఏళ్ల నుంచి జుట్టు పెంచుకుంటూనే ఉన్నాను. ఈ కాలంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక మే 4వ తేదీన ఫలితాల వెల్లడి రోజు నా కళ్లు టీవీకి అతుక్కుపోయాయి. చివరకు బీజేపీ విజయం సాధించడంతో నా ఆనందానికి అవధుల్లేవు. నా నిరసనను విరమించి గురువారం గుండు గీయించుకున్నాను. ఇకపై నా తలపై మొలిచేది బీజేపీ వెంట్రుకలు. 15 ఏళ్ల నుంచి బమన్ పారా గ్రామంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు అని బర్మన్ తెలిపాడు.
