పీఎం కేర్స్ నిధుల ఖర్చుపై అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు

2024-25లో రూ.8,452 కోట్ల పీఎం కేర్స్ నిధుల్లో కేవలం రూ.87 లక్షల ఖర్చుపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమర్శలు చేశారు. నిధులను ప్రజలకు ఉపయోగించాలని సూచించారు.

2024–25 కాలంలో రూ.8,452 కోట్ల పీఎం కేర్స్ నిధుల్లో కేవలం రూ.87 లక్షలనే ఖర్చు చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా తప్పుబట్టారు. వేల కోట్లలో పేరుకుపోయిన పీఎం కేర్స్ నిధులతో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు బెంచీలు ఏర్పాటు చేయొచ్చు.. మంచి భవనాలు నిర్మించొచ్చు.. స్కూళ్లకు వెళ్లే దారులను మెరుగ్గా తయారు చేయొచ్చు కదా అని దీప్కే ప్రశ్నించారు. ఒక మోడల్ స్కూల్‌కు రూ.8 కోట్లు ఖర్చు పెడితే.. 1,000 మోడల్ స్కూళ్లు తయారవుతాయని ప్రధాని మోదీకి సూచించారు. విరాళాలుగా ప్రజలు, సంస్థలు అందించిన నిధులను ఎఫ్ డీల రూపంలో ఖర్చు చేయకుండా పెడితే ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు.

పీఎం కేర్ ఫండ్‌ లక్ష్యాలు ఏమిటి..?

కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 27, 2020న ప్రత్యేకంగా ‘పీఎం కేర్స్ ఫండ్’ పేరుతో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. భారత ప్రధానమంత్రి ఈ ట్రస్ట్‌కు పదవీరీత్యా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రక్షణ, హోం, ఆర్థిక శాఖల కేంద్ర మంత్రులు పదవీరీత్యా ట్రస్టీలుగా ఉంటారు. ప్రధానమంత్రి నియమించిన ఇద్దరు ట్రస్టీలుగా రిటైర్డ్‌ జడ్జీలు కూడా ఉన్నారు. కరోనా వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకప్రకృతి లేదా మానవసృష్టి విపత్తులు, ఇతర సంక్షోభ సమయాల్లో బాధితులకు సహాయం అందించేందుకు ఈ నిధిని సృష్టించారు.అవసరమైతే ఆరోగ్య సదుపాయాల ఏర్పాటు లేదా అభివృద్ధి, పరిశోధన, మౌలిక వసతులు, బాధితులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలకు నిధులు వినియోగించవచ్చని ఫండ్‌ అధికారికంగా చెబుతోంది.

దీని ద్వారా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుమీద బ్యాంకులో ప్రత్యేకంగా రూ. 10 లక్షల కార్పస్ ఫండ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత వారికి రూ. 10 లక్షల నుండి ప్రతి నెలా కొంత చొప్పున స్టైపెండ్ (నెలవారీ ఖర్చులు) ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత మొత్తం రూ. 10 లక్షల సొమ్మును ఒకేసారి వారి చేతికి అందిస్తారు. అర్హులైన అనాథ పిల్లలను గుర్తించి, వారి పేరు మీద కేంద్ర ప్రభుత్వమే సంబంధిత రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను/పాస్‌బుక్‌లను అందజేస్తుంది.

ప్రస్తుతం రూ. 8,452కోట్లు నిధులు..

2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదిక విడుదలైంది. మార్చి 31, 2025 నాటికి ఫండ్‌లో రూ.8,452.95 కోట్లు నిల్వలు ఉన్నాయి. ఇందులో అధిక భాగం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం సుమారు రూ.7,188.63 కోట్లుగా ఉండగా.. ఏడాది వ్యవధిలో నిధి పరిమాణం గణనీయంగా పెరిగింది. గతే ఏడాదితో పోల్చితే విరాళాలు తగ్గినప్పటికీ, వడ్డీ ఆదాయం వల్ల మొత్తం నిధి పెరిగింది.

విరాళాలు తగ్గిన..పెరిగినా మొత్తం

2024-25లో దేశీయ విరాళాల రూపంలో పీఎం కేర్స్ ఫండ్స్ కు సుమారు రూ.4,790 కోట్లు అందినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దేశీయ విరాళాలు తగ్గాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గిపోయాయి. 2024-25లో విదేశాల నుంచి వచ్చిన విరాళాలు సుమారు రూ.92 లక్షలుగా ఉండగా, 2023-24లో ఈ మొత్తం దాదాపు రూ.1.13 కోట్లుగా ఉంది. అయితే విరాళాలు తగ్గినప్పటికీ, వడ్డీ ఆదాయం, ఇతర లెక్కల కారణంగా ఫండ్ మొత్తం నిల్వలు పెరిగాయి.

ఖర్చు అధ్వాన్నం..అందుకే విమర్శలు..

పీఎం కేర్స్ ఫండ్స్ ఆడిట్‌ నివేదిక మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎం కేర్స్ ఫండ్స్ నుంచి రూ.87.85 లక్షల మేర చెల్లింపులు నమోదయ్యాయి. ముఖ్యంగా పీఎం కేర్ ఫండ్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకానికి సుమారు రూ.87 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో అమలు సంస్థల నుంచి పీఎం కేర్ ఫండ్స్ కు సుమారు రూ.324.65 కోట్ల మేర రీఫండ్‌ వచ్చినట్లు ఆర్థిక వివరాల్లో నమోదైంది. అంటే గతంలో కేటాయించిన లేదా విడుదల చేసిన నిధుల్లో కొంత భాగం వినియోగించకుండా తిరిగి ఫండ్‌కు చేరినట్లు అర్థమవుతోండటం ఆసక్తికరం.

Latest News