ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్ ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధిన్ ఓవైసీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు
మోదీ వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ కౌంటర్
విధాత : ముస్లిం సమాజంలోని పురుషులే ఎక్కువగా కండోమ్లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్ ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధిన్ ఓవైసీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని సంపద పునర్విభజన అనే హామీని ప్రస్తావిస్తూ దేశంలోని ప్రజల సందపను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారా..? అని ప్రశ్నించారు. దేశంలోని వనరులపై ముస్లింలకే తొలి హక్కు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ప్రధాని చేసిన ఆ వ్యాఖ్యలకు కౌంటర్గా అసదుద్ధిన్ ప్రతిస్పందించారు. నరేంద్రమోదీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు 10-12 మంది సోదరీమణులు ఉన్నారని అసదుద్ధిన్ చెప్పారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. మన హిందూ సోదరుల్లో భయాన్ని సృష్టించేందుకు నరేంద్రమోడీ ద్వేషాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరని, నరేంద్రమోదీ ముస్లింల పట్ల ఈ భయాన్ని మీరు ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అని పిలిచారని, దళితులు, ముస్లింల పట్ల ద్వేషం మోదీ గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం వేసినట్లు సంజ్ఞ చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇది మసీదుపై బాణం వేయడం కాదని, నగరంలో శాంతిని నాశనం చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నమని ఆరోపించారు.