విధాత : పశ్చిమబెంగాల్‌లో రాజకీయపరమైన హింసాత్మక ఘటనలు ఆందోళనకరంగా మారాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్‌ బెనర్జీపై శనివారం బీజేపీ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎంపీ కల్యాణ్‌ బెనర్జీపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అతడి తలకు గాయమైంది.

హుగ్లీ జిల్లాలో శ్రీరామ్‌పూర్ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ.. అరెస్టయిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు చండితాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే బీజేపీ కార్యకర్తలు టీఎంసీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడికి ముందు కొందరు వ్యక్తులు కల్యాణ్ బెనర్జీకి నల్ల జెండాలు చూపిస్తూ ‘చోర్ చోర్’ (దొంగ దొంగ) అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆయన పర్యటనలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వగా ‘చోర్ చోర్’ అంటూ నినాదాలు చేశారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం

ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టులు, ఆ తర్వాత జరిగిన ఈ ఘర్షణ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్‌ లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడుల పరంపర కొనసాగుతున్నది. టీఎంసీ నేతలపై వరుస దాడులు జరుగుతుండటం కలకలం రేపుతోంది.