Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రభుత్వం పలు ప్రకటన చేసింది. వ్యవసాయోత్పత్తి, యువత నైపుణాభివృద్ధి, ఉపాధి కల్పనకు సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో పలు ప్రకటనలు చేశారు. బడ్జెట్ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ యువతకు పెద్దపీట వేశారు. తొలిసారి ఉద్యోగానికి వెళ్లే వారికి తీపికబురు చెప్పింది. సంఘటిత రంగంలో తొలిసారిగా ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగులకు నెల జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మూడువిడుతలుగా అందించనున్నట్లు పేర్కొంది. అయితే, రూ. లక్ష కంటే తక్కువ జీతం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ప్రయోజనం పొందనున్నారు. ఈపీఎఫ్ఓలు పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ సహాయం అందించనున్నది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని చాలా మంది యువత ఎంతో ప్రయోజనం పొందనున్నారు. అలాగే ప్రభుత్వం ఉపాధికి సంబంధించి మూడుపతకాలను ప్రారంభించనున్నదని తెలిపారు. ఒక నెల పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందించడం ద్వారా ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించే 30లక్షల మంది యువతకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ఆమె చెప్పారు. వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దేశంలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. టాప్-500 కంపెనీల్లో కోటి మంది యువతకు 12 నెలల ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ ఇంటర్న్షిప్ 12 నెలల పాటు ఉంటుంది. ఇందులో యువతకు వ్యాపార వాస్తవిక వాతావరణాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇందులోభాగంగా యువతకు ప్రతినెలా రూ.5వేల భృతి కూడా ఇవ్వనున్నారు. కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద శిక్షణ ఖర్చు, 10శాతం ఇంటర్న్షిప్ ఖర్చును భరిస్తాయన్నారు.