భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే.. ఇక్కడ నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుని ఉంటే.. పాకిస్థాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు
ఇండియా ఎన్నికల్లో పాకిస్థాన్ చర్చ ఎందుకు?
అధిక ధరలు, నిరుద్యోగంపై చర్చ ఏది?
వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం
బీజేపీపై మండిపడిన కాంగ్రెస్ నేత ప్రియాంక
రాయ్బరేలీ: భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే.. ఇక్కడ నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుని ఉంటే.. పాకిస్థాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వివాదం చేయడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. వాస్తవ అంశాల ఆధారంగా ఎన్నికల్లో కొట్లాడాలని అధికార బీజేపీకి ఆమె హితవు పలికారు. ఈ మేరకు ఒక వార్తా సంస్థకు ఆమె ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ నేతలు హిందూ, ముస్లిం అంశాలను రెచ్చగొడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. కుల, మత ప్రాతిపదికన ప్రజలు ఈ ఎన్నికలను కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. ‘మీరు (బీజేపీ) ఇప్పటికి రెండు ఎన్నికలను మతం పేరుతో గెలిచారు. ఇక దాని నుంచి బయటపడండి అని ప్రజలు చెబుతున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన అంశంపై ప్రశ్నించగా..
పాత స్టేట్మెంట్ల గురించి ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నారని ఆమె నిలదీశారు. ‘ఆయన ఆ ప్రకటన ఎప్పుడు చేశారు? అది పాతదైతే ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు? రెండో అంశం.. ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లోనా? పాకిస్థాన్లోనా? ఇండియాలో జరుగుతున్నాయి. మరైతే పాకిస్థాన్ గురించి చర్చ ఎందుకు?’ అని అమేథీలో పార్టీ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రశ్నించారు.
దేశంలో 45 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న నిరుద్యోగం గురించి ఎందుకు ప్రశ్నించరు? మార్కెట్కు వెళ్లి తాము కొనుగోలు చేయాలనుకున్నవాటిలో సంగంతోనే ఇంటికి వస్తున్నారు. ఈ అధిక ధరల గురించి ప్రశ్నించరు? అని ప్రియాంక అడిగారు. ‘తగిన రాబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ మొదలుకుని, వ్యవసాయ పనిముట్ల దాకా ప్రతిదీ ఖరీదైపోయింది. దీన్ని ఎందుకు చర్చించరు? కార్మికులను దోపిడీ చేస్తున్నారు. వారికి తగిన వేతనాలు రావడం లేదు. దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు?
పాకిస్థాన్ సార్వభౌమాధికార దేశం కనుక పాకిస్థాన్ను గౌరవించాలని, అందులోనూ ఆ దేశం వద్ద అణు బాంబు కూడా ఉన్నది’ అని ఒక పాత వీడియోలో అయ్యర్ వ్యాఖ్యానించారు. దానిని వెతికి తీసిన బీజేపీ.. దాని ఆధారంగా కాంగ్రెస్పై పెద్ద ఎత్తున దాడి చేస్తున్నది. ఈ నేపథ్యంలో దానిని గట్టిగా తిప్పికొట్టిన ప్రియాంక.. చర్చించాల్సిన సమస్యలు, పరిష్కారాలు వెతకాల్సిన అంశాలు చాలా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. వాస్తవ అంశాలు, తన పనితీరు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే హిందూ, ముస్లిం అంశాలను బీజేపీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక స్పష్టం చేశారు.
‘ప్రజలు విసిగెత్తిపోయారని నేను భావిస్తున్నా. ప్రతి ఎన్నికల్లోనూ హిందూ, ముస్లిం అంశాలను లేవనెత్తుతున్నారని ప్రజలకు అర్థమైంది. ఒక్కోసారి దేవుడిపై ఒట్టు వేయించుకుని ఓట్లు అడుగుతున్నారు. ఏంటీ అర్థంలేని పనులు?’ అని ప్రియాంక మండిపడ్డారు. బీజేపీనేతలు తమ పనితీరు ఆధారంగా ఓట్లు అడగాలన్నారు. ఇంకా ఎన్ని ఎన్నికల దాకా హిందూ, ముస్లిం అంశాలు లేవనెత్తి ఓట్లడుగుతారని ఆమె ప్రశ్నించారు.
అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు ఒక డిమాండ్ చేస్తున్నారు. కుల మతాల ఆధారంగా ఎన్నికల్లో పోరాడే పద్ధతి వద్దని చెబుతున్నారు. ధరల పెరుగుదలపై, నిరుద్యోగంపై, రైతుల సమస్యలపై, వాస్తవ అంశాలపై, మనం రోజువారీ ఎదుర్కొంటున్న సమస్యలపై కొట్లాడాలని కోరుకుంటున్నారు.