మే నెలతో పోల్చితే జూన్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పు, హైబ్రిడ్ వాహనాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు.
ముంబై: మే నెలతో పోల్చితే జూన్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పు, హైబ్రిడ్ వాహనాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు. రోడ్డు రవాణా, హైవేల శాఖ వాహన్ డాటా ప్రకారం.. 2024 జూన్లో ఈవీల అమ్మకాలు 14శాతం తగ్గి 1,06,081 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024, మే నెలలో 1,23,704 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఈ ఏడాది అమ్మకాల్లో ఇదే కనిష్ఠం.
అయితే.. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 8,39,545 యూనిట్ల ఈవీలు అమ్ముడుపోయాయి. మొత్తం అమ్ముడైన వాహనాల్లో ఇవి 6.69 శాతం. గత ఏడాది ఎలక్ట్రిక్ టూ వీలర్లపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించడంతో అమ్మకాలు బాగా తగ్గాయి. 2024లో ఇప్పటి వరకూ అమ్ముడైన ఈవీల్లో 57శాతం టూవీలర్లే కావడం విశేషం. మొత్తం 8,39,545 యూనిట్లు అమ్ముడయ్యాయి.