Gujarat ATS| గుజరాత్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్రం..ముగ్గురి అరెస్టు

గుజరాత్ రాష్ట్రంలో భారీ ఉగ్ర కుట్రను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్( ఏటీఎస్) పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రదాడి కుట్రకు ప్రయత్నించిన హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు

న్యూఢిల్లీ : గుజరాత్ రాష్ట్రంలో భారీ ఉగ్ర కుట్రను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్( Gujarat ATS) పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రదాడి కుట్రకు ప్రయత్నించిన హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌(Syed Ahmad Mohiyuddin)తో పాటు మరో ఇద్దరిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన మొహియుద్దీన్‌ ఫ్రాన్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్లు గుర్తించారు. ఆదివారం అతని నివాసంలో సోదాలు చేసిన గుజరాత్ పోలీసులు.. రెండు గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొహియుద్దీన్ ఐఎస్‌కేపీ సభ్యులతో చర్చలు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

పాకిస్థాన్‌ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐతో ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని, గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తున్నామని, తాజాగా ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని పట్టుకున్నట్లు ఏటీఎస్‌ వెల్లడించింది. గుజరాత్‌ కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాలకు ఆయుధాల్ని సరఫరా చేసి..అనంతరం పేలుళ్లకు పథకం వేశారని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఏటీఎస్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసింది. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన మహిళ కాగా, ఆమె పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలున్న ఆన్‌లైన్ టెర్రర్ మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 22న ఫర్దిన్ షేక్, సైఫుల్లా ఖురేషి, మొహమ్మద్ ఫైక్, జీషన్ అలీ అనే నిందితులను అరెస్టు చేసింది. అప్పటి నుంచి నోయిడాలోని జీషన్ అలీ నివాసంపై నిఘా వేసిన ఏటీఎస్ తాజాగా దాడులు నిర్వహించి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు.