Hot summer : ఉత్తర భారతదేశంలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్థాన్ (Rajasthan) లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇవాళ రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారని తెలిపింది.
ఐదేళ్ల క్రితం 2019 జూన్ 1న రాజస్థాన్లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్ప్రదేశ్లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయంతో వణికిపోతున్నారు. శనివారం రాజస్థాన్లోని బర్మేర్లో 48.8 డిగ్రీలు, జైసల్మేర్లో 48 డిగ్రీలు, బికనీర్లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్లో 40 డిగ్రీలు, లుమిడింగ్లో 43 డిగ్రీలు, అరుణాచల్లోని ఈటానగర్లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.