NOTA | 2024 ఎన్నికల్లో నోటా(నన్ ఆఫ్ ద ఎబౌ) కు ఎన్ని ఓట్లు పోలై ఉండొచ్చనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ప్రతి ఎన్నికలో నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 60,00197 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 65,22,772కి చేరాయి.
NOTA | హైదరాబాద్ : 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో చివరి అంకం మిగిలి ఉంది. పోలింగ్ యుద్ధం ముగిసింది. ఇక వెలువడాల్సిందే ఫలితాలే. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో స్పష్టం కానుంది. అయితే 2024 ఎన్నికల్లో నోటా(నన్ ఆఫ్ ద ఎబౌ) కు ఎన్ని ఓట్లు పోలై ఉండొచ్చనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ప్రతి ఎన్నికలో నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 60,00197 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 65,22,772కి చేరాయి. ఈసారి ఈ సంఖ్యను అధిగమించనుందా..? అనే దానిపై విశ్లేషకులు దృష్టి సారించారు.
2019 ఎన్నికలను పరిశీలిస్తే.. నోటా ఓట్లు బీహార్ రాష్ట్రంలో అత్యధికంగా నమోదు అయ్యాయి. బీహార్లో 8,16,950 నమోదు కాగా, యూపీలో 7,25,097, తమిళనాడులో 5,50,577 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 4,68,822 ఓట్లు నోటాకు పోలై ఆరో స్థానంలో నిలిచింది. తెలంగాణ 13వ స్థానంలో నిలవగా, 1,90,798 ఓట్లు పోలయ్యాయి.
లక్షద్వీప్లో 100 ఓట్లు నోటాకు పోలై చివరి స్థానంలో నిలిచింది. అండమాన్లో 1,412 ఓట్లు, దమణ్దీవ్లో 1,487 ఓట్లు పోలయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్ల విషయంలో ఏ రాష్ట్రం అగ్ర భాగంలో నిలవనుంది..? ఏ రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలవనుందో వేచిచూద్దాం.