‘మహిళా బిల్లు’ బూచీ అట్టర్‌ఫ్లాప్‌

మహిళలకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయన్న బీజేపీ వాదనను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జనం పట్టించుకున్నారా?

  • By: TAAZ |    national |    Published on : May 04, 2026 6:36 PM IST
‘మహిళా బిల్లు’ బూచీ అట్టర్‌ఫ్లాప్‌

మహిళా రిజర్వేషన్‌ ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నించి విఫలమైన బీజేపీ.. ఈ దేశంలోని ప్రతిపక్షాల వల్లే మహిళలకు రిజర్వేషన్‌ అందకుండా పోతున్నది గగ్గోలు పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఒకవైపు ఎన్నికల వేళ టీవీల్లోకి వచ్చి.. ప్రతిపక్షాలరే నానా శాపనార్ధాలు పెట్టారు. ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకులని నిప్పులు చెరిగారు. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. అసలు మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశం చర్చల్లోనే లేదని తేలిపోతున్నది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించినందునే పరాజయాలు పొందలేదు. దానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్నది వాస్తవమైతే మరి తమిళనాడులో బీజేపీకి ఎందుకు ఓట్లు పడలేదు? డీఎంకే మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్నందుకు ఓటమి పాలైతే మరి టీవీకే ఎందుకు గెలిచింది?

కేరళలోనూ అదే వర్తిస్తుంది. కాంగ్రెస్‌ మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్నది నిజమైతే మరి కేరళలో ఆ పార్టీ ఎలా గెలిచింది? కేరళలో కాంగ్రెస్‌ విజయానికి, మహిళా రిజర్వేషన్‌కు సంబంధమే లేదు. కేరళలో ఒక్కో దఫా ఒక్కో కూటమికి అధికారం అప్పగించడం సంప్రదాయంగా వస్తున్నది. ఇప్పుడు కూడా ఆ అంశం కీలకంగా పనిచేసింది.

ఇక పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముందుగానే ఆ పార్టీ నిర్బంధకాండ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించగా.. మరోవైపు బీజేపీ తన ఆధీనంలోని కేంద్ర సంస్థలన్నింటినీ యాక్టివ్‌ చేసింది. దాదాపు 27 లక్షల ఓట్లు తొలగించారు. తిలాపాపం తలా పిడికెడు అన్న చందాన అన్నీ కలగలిసి మమత ఓడిపోయారు. తప్పించి.. మహిళా రిజర్వేషన్‌ అంశం కానేకాదని విశ్లేషకులు అంటున్నారు.