Sugar Export Ban | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలపై ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బ్యాన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే మే 13వ తేదీకి ముందు లోడింగ్ ప్రారంభమైనా.. ఇప్పటికే చక్కర నిల్వలను కస్టమ్స్కు అప్పగించినా వాటి ఎగుమతులకు అనుమతిస్తామని తెలిపింది. అలాగే ఇతర దేశాల ఆహార భద్రత అవసరాల దృష్ట్యా భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిన సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం యూరప్, అమెరికాకు ఈ బ్యాన్ వర్తించదని స్పష్టం చేసింది.
