Puja Khedkar : ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పరారీలో ఉన్నారా..? ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా..? అంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తున్నది. ఢిల్లీ కోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించినప్పటి నుంచి ఖేద్కర్ ఆచూకీ లేకుండా పోయింది. బెయిల్ పిటిషన్ తిరస్కరణతో అరెస్ట్ చేస్తారనే భయంతో ఆమె దేశం విడిచి పారిపోయారా..? అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
అయతే ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారనే అంశాలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు.
కానీ కోర్టు అందుకు నిరాకరించింది. పూజాపై కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని, బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు యూపీఎస్సీ ఆదేశించినా ఆమె ముస్సోరీలోని అకాడమీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోలేదు.
దాంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై స్పందించేందుకు ఖేద్కర్ ఆగష్టు 4వ తేదీ వరకు గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జూలై 30 దాకా అవకాశం ఇచ్చింది. కానీ జూలై 30 వరకు కూడా ఆమె అకాడమీ ముందుకు వెళ్లలేదు. దీంతో ఆమె అరెస్ట్ భయంతో దుబాయ్కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయం అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.