ఆ పులిని చంపేయండి..! కేరళ ప్రభుత్వం ఆదేశాలు
వయనాడ్ జిల్లాలో అలజడి సృష్టిస్తున్న ఓ పెద్ద పులిని చంపేయాలంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఆ పెద్ద పులి ఓ రైతుపై దాడి చేసి చంపిన

తిరువనంతపురం : వయనాడ్ జిల్లాలో అలజడి సృష్టిస్తున్న ఓ పెద్ద పులిని చంపేయాలంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఆ పెద్ద పులి ఓ రైతుపై దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం పృష్టించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. వయనాడ్కు చెందిన ప్రజీశ్(36) గడ్డి కోసమని అడవికి వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద పులి ప్రజీశ్పై ఆకస్మాత్తుగా దాడి చేసి చంపింది. అంతటితో ఆగకుండా ప్రజీశ్ శరీరంలోని కొంత భాగాన్ని కూడా పులి తినేసింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పులుల నివారణకు చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్థానికులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఆ పులిని చంపేయాలంటూ కేరళ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, చంపడానికి ముందు అది మ్యాన్ ఈటర్ అవునా..? కాదా..? అనేది ధ్రువీకరించుకోవాలని సూచించింది. టార్గెట్ చేసిన పులి మ్యాన్ ఈటర్ అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని బంధించలేకపోతే చంపేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుతం పులి జాడ గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. జనవరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 52 ఏండ్ల రైతును పులి చంపింది.