• Telugu News
  • /National

ఆ బిజినెస్ మ్యాన్ ను కాబోయే భార్యే ఖతం చేసింది..!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పూణే గహుంజేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మరణం వెనుక మిస్టరీ వీడిపోయింది. కేతన్ అగర్వాల్ కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ తో కలిసి పక్కా పథకంలో అతడిని కోటపై నుంచి లోయలోకి తోసివేసి చంపినట్లుగా పోలీసు విచారణలో వెల్లడైంది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jun 24, 2026, 11:47 am IST
Read Time: 11 mins
ఆ బిజినెస్ మ్యాన్ ను కాబోయే భార్యే ఖతం చేసింది..!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పూణే గహుంజేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26, ఇటీవలే విదేశాల నుండి తిరిగి వచ్చారు) మరణం వెనుక మిస్టరీ వీడిపోయింది. కాబోయే భార్యతో టూరిస్ట్ స్పాట్ లోహగఢ్ కోట సందర్శనకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడని ముందుగా అంతా భావించారు. అయితే ఈ కేసు పోలీస్ దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. కేతన్ అగర్వాల్ మరణానికి కాబోయే భార్యనే కారణమని పోలీస్ దర్యాప్తులో పక్కాగా తేలింది. కేసు విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. సియా ప్రియుడు చేతన్‌ సహకారంతో కేతన్ అగర్వాల్ ను అతడి కాబోయే భర్యా సియా గోయల్ హత్య చేసిందని గుర్తించారు.

కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్ బర్త్‌డే వేడుకల కోసం లోనావాలా సమీపంలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ లోహగఢ్ కోటకు వెళ్లారు. అయితే గత గురువారం ఉదయం కేతన్ అనూహ్యంగా కోటపై నుండి ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. మొదట బలమైన గాలుల వల్ల ఫోటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని పోలీసులు భావించారు. సియాగోయల్ కూడా తన బర్త్ డే సందర్భంగా ట్రెక్కింగ్ కు వచ్చామని, ప్రమాదవశాత్తు కేతన్ లోయలో పడిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె సమాధానాలపై సందేహాలతో పోలీసులు అనుమానస్పద మృతి కోణంలో దర్యాప్తు కొనసాగించి హత్యగా తేల్చారు.

కాబోయే భార్యనే హంతకురాలు..

కేతన్ అగర్వాల్ కేసులో పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ‘హత్య’ అని అనుమానిస్తూ మర్డర్ కేస్ నమోదు చేశారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్‌తో పాటు ఆ సమయంలో అక్కడ ఉన్న మరో ఇద్దరిపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఆమె ప్రియుడు చేతన్ తో కలిసి ఈ హత్య చేసి ప్రమాదం కింద క్రియేట్ చేసిందని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఫోటోలు తీస్తున్నసమయంలో కేతన్ ను అతని కాబోయే భార్య సియా గోయల్ లోయలోకి తోసేసినట్టుగా దర్యాప్తులో తేలింది. కేతన్‌-సియా లోహ్‌గఢ్‌ కోటకు వెళ్లిన దారిలో చేతన్ ముసుగు వేసుకుని కనిపించాడని, ప్రమాదం జరిగిన ప్రాంతంలోనూ అతడు ఉన్నట్లు గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. సియాకు, ఆ ముసుగు వ్యక్తికి ఏదైనా పరిచయం ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తు చేయగా.. కుట్ర కోణం తెలిసిపోయిందని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో సియాకు పుణెలోని కొంధ్వాకు చెందిన చేతన్‌ బాబూలాల్‌ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. చేతన్‌-సియా మధ్య 2004 కాల్స్ నడిచాయని, ఇద్దరూ 238 గంటలు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ రికార్డుల ఆధారంగా వారి బంధాన్ని నిర్ధారించుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

కేతన్ మర్డర్ కు మూడుసార్లు ప్లాన్….

కేతన్ ను అడ్డుతొలగించుకునే పథకంలో భాగంగా అతడిని లోహగఢ్ కోటవద్దకు తీసుకెళ్లాలని సియా పలుమార్లు అడిగిందని కేతన్ సోదరి పోలీసులకు వెల్లడించింది. తొలుత మే 31న ఇద్దరూ లోహ్‌గఢ్‌ ఫోర్ట్‌కు వెళ్లారు. మళ్లీ జూన్ 4వ తేదీన కూడా అక్కడికి తీసుకెళ్లమని సియా అడగ్గా.. కేతన్ తల్లి అందుకు అంగీకరించలేదని, మరోసారి ప్రివెడ్డింగ్ షూట్‌లో భాగంగా బాలికి వెళ్లడానికి ముందే కేతన్‌ అడ్డు తొలగించుకోవాలని సియా భావించిందని..అయితే కేతన్ పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోవడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పోలీసులకు తెలిపింది. మా అందరి పాస్‌పోర్టులు ఉన్నప్పటికి… కేతన్‌ది మాత్రం కనిపించకపోవడంతో ఎక్కడన్నా పడిపోయిఉండొచ్చని అనుకున్నాం అని, దాంతో అంతా వెనక్కి వచ్చేశాం అని కేతన్ సోదరి వెల్లడించింది.

తర్వాత మళ్లీ లోహ్‌గఢ్ కోటకు వెళ్లడం గురించి సియా పట్టుబట్టడంతో జూన్ 14న ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆ రోజు పైనుంచి తోయడంతో కేతన్ ఒక పొదను పట్టుకొని బతికిపోయాడు. పాము కనిపించిందని, అది కాటువేయకుండా కాపాడేందుకే తోశానని ఈ సందర్బంగా సియా చెప్పిన మాటలను కేతన్ నమ్మాడని అతడి తండ్రి విశాల్ అగర్వాల్ వెల్లడించారు. అప్పుడు ప్రాణాలతో బయటపడినా జూన్ 18న అదే ప్రాంతంలో మరోసారి పన్నిన కుట్రకు కేతన్ బలైపోయాడని వాపోయాడు. జూన్ 18న సియా-కేతన్ లోయ వద్దకు చేరుకోగానే.. వారితో ఆమె ప్రియుడు చేతన్ కూడా చేరినట్లు పోలీసు విచారణలో గుర్తించారు. సియా, ఆమె ప్రియుడు చేతన్‌ కలిసి కేతన్‌ను లోయలోకి తోసి, ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

పెళ్లి ఇష్టం లేదని చెబితే పోయేది…

నిజానికి కేతన్ తో తనకు పెళ్లి ఇష్టం లేదని, అంతకుముందే మరో వ్యక్తికి తాను ప్రేమించానని సియా గోయల్ అతడితో చెప్పి ఉంటే..ఎవరికి ఏ సమస్య ఉండేది కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. . ఇలా పక్కా స్కెచ్ వేసి మర్డర్ చేయడం ద్వారా ఎంతో భవిష్యత్తు ఉన్న కేతన్ అగర్వాల్ ప్రాణాలు పోయాయని, ఈ నేరానికి పాల్పడినందుకు సియాగోయల్ సహా ఆమెకు సహకరించిన నిందితులకు జైలు జీవితం మిగిలిందని..ఇదంతా హనీమూన్ మర్డర్ కేసు తరహాలో సాగిపోయిందని…ఇలాంటి వాటికి సమాజం దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. కేతన్‌కు, సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది.  నవంబర్‌లో జరగనున్న పెళ్లి కోసం కేతన్ అగర్వాల్  రాజస్థాన్‌లోని ఒక లగ్జరీ ప్యాలెస్‌ను రూ.17 కోట్లకు బుక్‌ చేసి, అతిథుల కోసం రెండు చార్టర్డ్‌ విమానాలను కూడా సిద్ధం చేశారు. అయితే నిశ్చితార్ధం తర్వాతా సియా గోయల్ అతనితో కలిసి ఉన్న వీడియోల్లో సైతం అతనంటే ఎంతగానో ప్రేమ ఉన్నట్టు నటించింది.

ఎవరికీ అనుమానం రాకుండా .. తన మీద ఆమె చూపిస్తున్న ప్రేమకి కేతన్ కరిగిపోయాడు. బర్త్ డే రోజు విలువైన కానుకులు ఇచ్చాడు. అయితే ఎప్పుడు తనకు కేతన్ తనకు ఇష్టం లేదనే విషయం చెప్పలేదు. జూన్‌ 18న సియా పుట్టినరోజు కావడంతో ఆమె కేతన్‌ను లోహగఢ్‌ కోటకు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లి చంపేసింది. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సియా ఇన్‌స్టాగ్రామ్‌లో కేతన్‌తో ఉన్న పాత వీడియోలను షేర్‌ చేస్తూ.. “నా పుట్టినరోజే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావు. నా గుండెకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, తిరిగి వచ్చేయ్‌” అంటూ కపట ప్రేమను ప్రదర్శించడం చూస్తే ఆమె కేతన్ ను ఎంత నమ్మించి కడతేర్చిందో అర్ధమవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.