• Telugu News
  • /National

Rahul Gandhi | ఎట్టకేలకు ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలీ నుంచి బరిలోకి రాహుల్‌గాంధీ

Rahul Gandhi | ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలో దిగనున్నారనే విషయంలో గత కొన్ని వారాలుగా నెలకొని ఉన్న ఉత్కంఠకు తెరపడింది. రాయ్‌బరేలీ అగ్రనేత నుంచి రాహుల్‌గాంధీని, అమేథీ నుంచి మరో సీనియర్‌ నేత కిశోరీ లాల్‌ శర్మను బరిలో దించుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో నామినేషన్‌ల దాఖలుకు నేటితో గడువు ముగియనుండంతో.. వారిద్దరూ ఇవాళే నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు.

Reported by: Thyagi | జాతీయం | May 03, 2024, 10:01 am IST
Read Time: 5 mins
Rahul Gandhi | ఎట్టకేలకు ఉత్కంఠకు తెర.. రాయ్‌బరేలీ నుంచి బరిలోకి రాహుల్‌గాంధీ

Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలో దిగనున్నారనే విషయంలో గత కొన్ని వారాలుగా నెలకొని ఉన్న ఉత్కంఠకు తెరపడింది. రాయ్‌బరేలీ అగ్రనేత నుంచి రాహుల్‌గాంధీని, అమేథీ నుంచి మరో సీనియర్‌ నేత కిశోరీ లాల్‌ శర్మను బరిలో దించుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో నామినేషన్‌ల దాఖలుకు నేటితో గడువు ముగియనుండంతో.. వారిద్దరూ ఇవాళే నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీతో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాలు దక్కాయి. అందులో 15 లోక్‌సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌ పార్టీ రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. సోనియాగాంధీ ఈసారి రాజ్యసభకు వెళ్లడంతో ఆమె సిట్టింగ్‌ స్థానమైన రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీనిగానీ, ప్రియాంకాగాంధీని గానీ బరిలో దించాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది.

ఈ రెండు నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలు. రాయ్‌బరేలీలో ఒక పర్యాయం జనతాపార్టీ, మరో పర్యాయం బీజేపీ మినహా ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తూ వచ్చింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1967 నుంచి 1977 వరకు, మరల 1980 నుంచి 1984 వరకు రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియాగాంధీ 2004 నుంచి 2024 వరకు ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడామె రాజ్యసభకు వెళ్లడంతో ఆ కుటుంబం నుంచి ఒకరిని బరిలో దించాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది.

అటు అమేథీ నుంచి కూడా 1980 నుంచి 81 వరకు సంజయ్‌గాంధీ, 1981 నుంచి 1991 వరకు రాజీవ్‌గాంధీ, 1999 నుంచి 2004 వరకు సోనియాగాంధీ, 2004 నుంచి 2019 వరకు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. మిగతా సందర్భాల్లో కూడా అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. ఒకసారి జనతాపార్టీ, రెండు సార్లు బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ బీజేపీ నుంచి గెలిచిన రెండో అభ్యర్థి. అందుకే ఈ స్థానంలో సోనియా కుటుంబం నుంచే ఒకరు బరిలో ఉంటే బాగుంటుందని కాంగ్రెస్‌ భావించింది.

అయితే ఇప్పటికే కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీలో ఉన్న రాహుల్‌గాంధీ.. ఈ రెండు స్థానాల్లో కూడా ఒక స్థానం నుంచి బరిలో దిగేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ ప్రియాంకాగాంధీ మాత్రం పోటీకి నిరాకరించారు. దాంతో ఆఖరి రోజు దాకా వేచి చూసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌గాంధీని, అమేథీ నుంచి కిశోరీలాల్‌ శర్మను తమ అభ్యర్థులుగా ఖరారు చేసింది.