Atal Setu | మహారాష్ట్ర ముంబయిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జ్ (Atal Setu Bridge)పై షాకింగ్ సంఘటన చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ అటల్‌ సేతుపై నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించగా క్యాబ్‌ డ్రైవర్‌ రక్షించాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ క్యాబ్‌లో అటల్‌ సేతు మీదుగా ప్రయాణం చేస్తున్నది. కారును వంతెన వద్ద ఆపాలని చెప్పింది. సముద్రంలో మతపరమైన చిత్రాలను నిమజ్జనం చేస్తానని చెప్పి అటల్ సేతు వంతెన దగ్గర కారును ఆపాలని ములుంద్‌కు చెందిన మహిళ క్యాబ్ డ్రైవర్ సంజయ్ యాదవ్‌ను కోరింది. అయితే, క్యాబ్‌ డ్రైవర్‌ ఆమె వంతెన రెయిల్‌ దాటడంతో పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులను చూసి మహిళ సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకుని రక్షించాడు. ఆ తర్వాత నలుగురు కానిస్టేబుళ్లు రైలింగ్‌ను దాటి మహిళను రక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆ మహిళను నవీ ముంబైలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై మహిళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. మహిళ మానసిక సమస్యలతో బాధపడుతుందని కుటుంబీకులు తెలిపారని నవా షెవా పోలీస్ స్టేషన్ సీనియర్ సూపరింటెండెంట్ అంజుమ్ బగ్వాన్ తెలిపారు. అటల్ సేతు వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలోనూ జరిగాయి. ఈ ఏడాది జులైలో 38 ఏళ్ల ఇంజనీర్ ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురై ఇక్కడి నుంచి దూకాడు. అంతకుముందు మార్చిలో 43 ఏళ్ల మహిళా వైద్యురాలు అటల్ సేతు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆ మహిళ తన ఫ్లాట్‌లో సూసైడ్ నోట్‌ను వదిలి వెళ్లింది.