ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఉత్తర్వులను ప్రస్తావించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని తెలిపారు. సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టుకు కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
అయితే రిప్లే పిటిషన్ దాఖలుకు సీబీఐ తరపున న్యాయవాది సమయం కావాలని కోరారు. దీంతో 10వ తేదీన వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో కవితను జైల్లోనే సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రశ్నించే ముందు రోజు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించాలని సూచించింది. జైల్లోకి సీబీఐ అధికారులు ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.