Lemon | నాగరిక సమాజంలోనూ మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మకాయలతో సంతానం, వివాహప్రాప్తి లభిస్తుందని నమ్మిన భక్తులు.. వాటిని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు ఓ 9 నిమ్మకాయలను రూ. 1.43 లక్షలకు దక్కించుకున్నారు. ఈ నిమ్మకాయల కథ తెలుసుకోవాలంటే తమిళనాడు వెళ్లాల్సిందే.
తమిళనాడు విళుప్పురం జిల్లా తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టందాల్ గ్రామంలో రత్నవేల్ మురుగన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రస్తుతం పంగుణి ఉత్తిరం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలు ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం కాగా.. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఆలయ గర్భగుడిలో వేల్ను మాత్రమే ఉంచి పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ ఆనవాయితీలో భాగంగా 9 నిమ్మకాయలను దండ రూపంలో కూర్చి.. వేల్కు అలంకరిస్తారు. పూజాకార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి సమయంలో ఆ నిమ్మకాయలను వేలం వేస్తారు. తొలిరోజు 9 నిమ్మకాయలను రూ. 45,500కు భక్తులు దక్కించుకోగా, రెండో రోజు రూ. 15 వేలకు దక్కించుకున్నారు. మూడోరోజు మాత్రం 9 నిమ్మకాయలను వేలం పాటలో రూ. 1.43 లక్షలకు భక్తులు దక్కించుకున్నారు.
ఈ నిమ్మకాయలకు ఎందుకంత డిమాండ్..?
దక్షిణ భారతదేశంలో చాలా ఆలయాల్లో నిమ్మకాయలను విరివిగా వినియోగిస్తారు. అమ్మవార్లతో పాటు ఇతర దేవుళ్ల అలంకరణకు నిమ్మకాయలను ఉపయోగిస్తారు. అలా పూజకు వినియోగించిన నిమ్మకాయలను ఎంతో పవిత్రంగా చూస్తారు. అయితే రత్నవేల్ మురుగన్ ఆలయంలో పూజకు వినియోగించే నిమ్మకాయలకు కూడా భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ నిమ్మకాయలను తినడం వల్ల సంతానం, వివాహ ప్రాప్తి చేకూరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ఆ నిమ్మకాయలను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. లక్షల రూపాయాలకు కూడా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.
