వందేండ్లు నిండిన ఓటర్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వారు కూడా ఓటు హక్కు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా వందేండ్లు నిండిన ఓటర్లు కొన్ని వేల మంది ఉన్నారు.
ముంబై : దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇక వందేండ్లు నిండిన ఓటర్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వారు కూడా ఓటు హక్కు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా వందేండ్లు నిండిన ఓటర్లు కొన్ని వేల మంది ఉన్నారు.
అయితే మహారాష్ట్రలోని ఒక్క పుణె జిల్లాలోనే వందేండ్లు నిండిన వారు 5,492 మంది ఓటర్లు ఉన్నారు. వీరి వివరాలను ఎన్నికల అధికారులు సోమవారం వెల్లడించారు. 100 నుంచి 109 ఏండ్లు నిండిన వారు 5,437 మంది, 110 నుంచి 119 ఏండ్లు నిండిన వారు 16 మంది, 120 ఏండ్లకు పైబడిన ఓటర్లు ముగ్గురు ఉన్నారు.
5,437 మంది ఓటర్లలో 100 నుంచి 109 ఏండ్ల వయసున్న వారిలో 2,677 మంది పురుష ఓటర్లు, 2,795 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఒకరు ఉన్నారు. 110 నుంచి 119 ఏండ్ల వయసున్న వారిలో 8 మంది పురుష ఓటర్లు, మరో ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 120 ఏండ్లు పైబడిన వారిలో ఒకరు పురుషుడు కాగా, ఇద్దరు మహిళలు ఉన్నారు.